మావోల దాడి: సల్వాజుడుం మహేంద్ర కర్మ కాల్చివేత
రాయచూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పంజా విసిరారు. సల్వాజుడుం వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహేంద్ర కర్మను కాల్చి చంపారు. మావోలు కాంగ్రెసు వాహన శ్రేణిపై శనివారం సాయంత్రం ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. ఈ ఘటనలో 30 మంది అనధికారికంగా చనిపోయినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా 17 మంది చనిపోయినట్లు ప్రకటించారు. మహేంద్ర కర్మతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉద్యా ముదలియార్ను చంపేశారు.
ఛత్తీస్గఢ్ పిసిసి అధ్యక్షుడు నంద్కుమార్ పటేల్ను, ఆయన కుమారుడు దినేశ్ను నక్సలైట్లు అపహరించుకు వెళ్లారు. పరివర్తన్ యాత్రకు వెళ్లి వస్తున్న కాంగ్రెస్ నేతల కాన్వాయ్పై నక్సలైట్లు దాడి చేశారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా తీవ్రంగా గాయపడ్డారు. అతని శరీరంలోకి తుపాకి గుళ్లు పోయాయి. వాటిని వైద్యులు తొలగించారు. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి స్వల్పగాయాలతో బయటపడ్డారు.
మావోయిస్టులు ఎంతమందిని కిడ్నాప్ చేశారు? దాడిలో ఎందరు చనిపోయారు? ఈ దాడిలో ఎంత మంది నక్సల్స్ పాల్గొన్నారు? ఇలాంటి అనేక ప్రశ్నలపై తీవ్ర గందరగోళం నెలకొంది. అర్ధరాత్రి దాకా దీనికి సంబంధించిన స్పష్టత రాలేదు. సుమారు 30 మంది వరకు కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోయారని, పది మందిని నక్సల్స్ కిడ్నాప్ చేశారని వార్తలు వస్తున్నాయి. 17 మంది మాత్రమే చనిపోయారని, 20 మంది గాయపడ్డారని కేంద్ర హోంశాఖ ధ్రువీకరించింది. ఈ మెరుపు దాడిలో వంద నుంచి 1200 మంది నక్సల్స్ పాల్గొన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ నేతలు తమ ఉచ్చు నుంచి తప్పించుకోకుండా జవాన్లు తమ దరి చేరకుండా మావోయిస్టులు పకడ్బందీ ప్రణాళిక రచించారు. మందుపాతర పేల్చడానికి ముందే పెద్ద చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. దాడి జరిపిన తర్వాత చుట్టు పక్కల చెట్లకు నిప్పంటించారు. ఈనెల 17న భద్రతా దళాలు ఎనిమిది మంది గిరిజనులను చంపారంటూ శనివారం బంద్కు నక్సల్స్ పిలుపునిచ్చారు. అంతకు ఒక్కరోజు ముందే కాంగ్రెస్ నేతలపై దాడికి దిగడం గమనార్హం. బిజెపి చేపట్టిన వికాస్ యాత్రకు భద్రత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తమ యాత్రను మాత్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దాడి జరగడానికిదే కారణమని ఆరోపించారు.