కాంగ్రెస్పై చంద్రబాబు నిప్పులు, అవినీతి పార్టీలు ఇంటికే
రాబోయేది ఎన్నికల ఏడాది కాబట్టి ఈ మహానాడుకు ప్రత్యేకత ఉందన్నారు. చాలామంది పుడతారు, చస్తారు.. కానీ చరిత్రలో నిలిచిపోయే ఎకైక యుగపురుషుడు మాత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు మాత్రమే అన్నారు. జైల్లో ఉండే వ్యక్తుల కోసమే, వసూళ్ల పార్టీ వలే తాము చర్చలు జరపమన్నారు. లోక కల్యాణం టిడిపి లక్ష్యమన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందువల్లే తాను సుదీర్ఘ పాదయాత్ర చేశానన్నారు.
తనను కార్యకర్తలే నడిపించారన్నారు. కాంగ్రెసు పార్టీ దుష్ట పాలన వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. పాదయాత్రలో తాను ఎన్నో నిద్రపోని రోజులు ఉన్నాయని, ప్రజల కోసమే ఆలోచించానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మిగిలు విద్యుత్ ఉంటే ఇప్పుడు విద్యుత్ సమస్యతో చాలామంది నిరుద్యోగులుగా తయారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే తొలి సంతకం రైతు రుణ మాఫీ పైనే పెడతానని చెప్పారు.
టిడిపి అవినీతి వ్యతిరేక పోరాటం వల్లే కళంకిత మంత్రులు రాజీనామా చేశారన్నారు. అవినీతిని ఏమాత్రం సహించే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మహస్తం ఓ మాయా హస్తం అన్నారు. నాసిరకం వస్తువులు ఇస్తున్నారన్నారు. కాంగ్రెసు పాలనలో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. బెల్టు షాపులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మార్పు, అవినీతి ప్రక్షాళన కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర తన జీవితంలో మరుపులేని ఘట్టం అన్నారు. కేంద్రంలో బలహీన, పనికిమాలిన ప్రభుత్వం ఉందన్నారు. ఆటలను కూడా మలినం చేస్తున్నారన్నారు. ఐపిఎల్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిందన్నారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా అదే జరుగుతుందన్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి నేతలు టిడిపికి సవాళ్లు విసిరి ఇప్పుడు వారు చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడలేని వారు అధికారంలో ఉండేందుకు అర్హులు కాదన్నారు. రాష్ట్రంలో 1983కు ముందు ఎందరో రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేసిన ఎన్టీఆర్ మాత్రమే నిలదొక్కుకుందన్నారు. కిరణ్ ప్రభుత్వం ప్రజల రక్తం తాగే ప్రభుత్వమన్నారు.