మర్యాదపూర్వకంగానే కలిశా: హరికృష్ణతో భేటీపై గద్దె
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అలిగి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న హరికృష్ణ, విజయవాడ పార్లమెంటు సీటుపై పార్టీ నాయకత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న గద్దె రామ్మోహన్ మధ్య మంతనాలు జరగడంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. భేటీపై కలకలం రేగడంతో గద్దె రామ్మోహన్ రావు వివరణ ఇచ్చారు.
హరికృష్ణను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు ఆయన చెప్పారు. తనతోపాటు తమ పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, లంకా దాసరి, చలమలశెట్టి రామానుజయ్య కూడా ఉన్నారని తెలిపారు. హరికృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను కూడా ఎమ్మెల్యేనని, ఆ పరిచయంతోనే హరికృష్ణను కలిసి మాట్లాడానని చెప్పారు.
ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన పార్టీ మహానాడుకు హరికృష్ణ తొలి రోజు వచ్చారు. అయితే, చురుగ్గా వ్యవహరించలేదు. పార్టీ కండువా వేసుకోవడానికి కూడా నిరాకరించారు. రెండో రోజు పూర్తిగానే దూరంగా ఉన్నారు. పార్టీకి దూరమవుతూ వస్తున్న హరికృష్ణతో హోటల్ గదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ పార్లమెంటు సభ్యుడు గద్దె రామ్మోహన్ రావు బుధవారంనాడు సుదీర్ఘ మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి.