ఐపిఎల్ ఫిక్సింగ్: దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లింక్స్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ పాత్ర ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కేసులో డి - కంపెనీ డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్లను ఢిల్లీ పోలీసులు సహ నిందితులుగా చేర్చారు.
హవాలా మార్గాల ద్వారా భారతదేశంలో గ్యాంబ్లింగ్ను దావూద్ సిండికేట్ నియంత్రిస్తోందని, గ్యాంబ్లింగ్ రేట్లను కూడా నిర్ణయిస్తోందని ఢిల్లీ పోలీసులు ట్రయల్ కోర్టుకు మంగళవారం తెలిపారు. దీనివల్లనే శ్రీశాంత్తో పాటు ఇతర నిందితులపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నిరోధక చట్టం (మోకా) కింద సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు మోపడానికి సిద్ధపడ్డారు. అయితే, ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు.

వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్లు స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో పాలు పంచుకున్నట్లు ఆధారాలున్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్, అజిత్ చండిలలకు కోర్టు బెయిల్ నిరాకరించింది. వారిని ఈ నెల 18వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీశాంత్ తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొంత మంది బుకీలకు, ముంబై అండర్ వరల్డ్తో, విదేశాల్లోని వారి బాస్లు చోటా షకీల్ వంటి దావూద్ ఇబ్రహీం మనుషులతో సంబంధాలున్నట్లు ఆధారాలున్నాయని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ను, ఫిక్సింగ్ను విదేశాల నుంచి నియంత్రిస్తున్నారని, డబ్బు మాత్రం దేశంలోనే పుడుతుందని, దాన్ని వివిధ మార్గాల ద్వారా తరలిస్తారని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications