15 సీట్లతో తెలంగాణ, కత్తి మాకే ఇవ్వండి: కెసిఆర్

ఏ జాతీయ పార్టీకి కూడా కేంద్రంలో పూర్తి మెజారిటీ రాదని, తమకు 15 సీట్లు వస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధిస్తామని ఆయన అన్నారు. కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ఇచ్చే పరిస్థితిని కల్పిస్తామని అన్నారు. ఆంధ్రలో మూడు ముక్కలాట నడుస్తోందని కెసిఆర్ అన్నారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పారు.
తమ పార్టీ లేకుంటే కాగ్రెసు, తెలుగుదేశం, బిజెపి తెలంగాణ ప్రస్తావన తెచ్చేవి కావని ఆయన అన్నారు. యుద్ధం చేసేవాడికి కత్తి ఇవ్వాలని ఆయన సూచించారు. సీమాంధ్ర పార్టీలకు ఓట్లు వేసి తమను కొట్లాడమంటే ఎలా అని ఆయన అడిగారు. వచ్చిన తెలంగాణను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే అడ్డుకున్నారని ఆయన అన్నారు. ఆంధ్ర పార్టీలన్నీ కలిసి తెలంగాణను అడ్డుకున్నాయని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే రాజకీయ ప్రక్రియలో ముందుంటామని ఆయన చెప్పారు. మనం చేస్తోంది చిల్లరమల్లర పోరాటం కాదని, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని ఆయన అన్నారు. తెలంగాణకు ఆంధ్ర పార్టీల పెత్తనం అవసరం లేదని, సీమాంధ్ర పార్టీల్లో తెలంగామ వ్యక్తి పార్టీ అధ్యక్షుడవుతాడా అని ఆయన అన్నారు.
తెలంగాణకే పరిమితం కావాల్సిన నాగార్జునసాగర్ నీళ్లను మన నోళ్లను కొట్టి ఆంధ్రాకు తరలించుకుని పోతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications