స్నేహితుడి కొడుకు: జగన్ మీద పోటీపై డిఎల్ ఆవేదన

సొంత జిల్లాలో కనీసం కార్యకర్తలతో పరిచయం లేని, గాంధీ బొమ్మను కూడా చూడని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. పదవిలో ఉండేది నాలుగు రోజులేనని, అందుకే ముఖ్యమంత్రి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రులు సి.రామచంద్రయ్య, వట్టి వసంత కుమార్, బొత్స సత్యనారాయణ, జానా రెడ్డిలను భయపెట్టేందుకు తనను డిస్మిస్ చేశారన్నారు.
గత ఉప ఎన్నికల్లో అధిష్ఠానం తనపై ఒత్తిడి తెచ్చి, తన ప్రాణస్నేహితుడు వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేయించి తనను బలిపశువును చేసిందన్నారు. ముఖ్యమంత్రిలా కుట్రతో కాంగ్రెస్లో ఎవరిని చంపాలి, భూస్థాపితం చేయాలన్న ఆలోచన తనది కాదన్నారు. రాత్రి ఒంటిగంట వరకు ఇంట్లో కూర్చుని కుట్రలకు పాల్పడే తత్వం తనది కాదని, ఈ అసమర్థ, అవినీతి సిఎం దగ్గర మంత్రిగా పని చేయలేనంటూ 15 నెలల కిందటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపానని చెప్పారు.
ఈ కుట్రల సిఎం చెప్పే మాటలు వినకుండా, రాష్ట్రంలో పార్టీని బతికించాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. కిరణ్ మనసుమార్చుకొని పార్టీని బతికిస్తే 2014 ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తానని, అదే సమయంలో అవినీతి మరకలైన మట్కా చేతులతో, చెడిపోయిన వారిచేత టికెట్టు ఇప్పించుకోవాల్సిన దుస్థితిలో లేననన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపి తర్వాత నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను కలుస్తానని, వారి అభీష్టం మేరకు పార్టీలో కొనసాగడమా? లేదా? వేరే పార్టీలో చేరడమా అన్నది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications