ప్రత్యేక వంటకాలతో ఆజాద్ ఇంట్లో అతనికే కిరణ్ విందు
ఎపి భవన్ నుంచి ప్రత్యేకమైన వంటకాలు తెప్పించి ఆజాద్కు విందు ఇచ్చారు. ఢిల్లీలో భేటీకి వచ్చిన కిరణ్ను కేంద్ర మంత్రి పళ్లం రాజు మధ్యాహ్నం భోజనానికి తన నివాసానికి ఆహ్వానించారు. అంతర్గత భద్రత సమావేశం అనంతరం ఆయన పళ్లం రాజు ఇంటికి వెళ్లాలని భావించారు. అయితే సమావేశం అనంతరం అతను నేరుగా ఆజాద్ ఇంటికి వెళ్లారు.
లోపల కాసేపు మాట్లాడిన తర్వాత ఎపి భవన్ నుంచి క్యారియర్లలో భోజనాలు వచ్చాయి. చికెన్, మటన్, ఫిష్, కోడిగుడ్డు వేపుడు వంటి మాంసాహార వంటలతో పాటు మజ్జిగ, పులుసు, మామిడికాయ పప్పు వంటి ఐటమ్స్ వచ్చాయి. దాదాపు గంటన్నర పాటు ఆజాద్తో కిరణ్ భేటీ అయ్యారు.
డిఎల్ బర్తరఫ్, తదనంతర పరిణామాలతో పాటు తెలంగాణ అంశంపై వారు చర్చించినట్లుగా సమాచారం. ఆజాద్తో విందు సమావేశం తర్వాత కిరణ్ తిరిగి హోంశాఖ సమావేశానికి వెళ్లారు. సాయంత్రం ఐదు గంటలకు సమావేశం పూర్తయిన తర్వాత హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయానికి బయలుదేరారు. అంతలోనే వాహనాలను వెనక్కి తిప్పి పళ్లం రాజు నివాసానికి వెళ్లారు. ఆయనతో కాసేపు భేటీ అయిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.