సోనియాతో చిరు భేటీపై అలా అనకూడదు: బొత్స
గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, ఎవరు తప్పు చేసినా ఇతర నాయకులు ఎత్తి చూపటం సహజమేనని ఆయన అన్నారు. దానివల్ల తప్పు చేసిన నాయకులు దానిని సరిదిద్దుకుంటారని, లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారని చెప్పారు. వచ్చే నెలలో రాష్ట్రంలో పర్యటించాలని సోనియా, రాహుల్లను కోరానని, అందుకు సోనియా సానుకూలంగా స్పందించారని చెప్పారు.
పిసిసి కార్యవర్గం కూర్పు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే - ఇప్పటికే పిసిసి కార్యవర్గం ఉన్నదని, మార్పులు చేర్పులు ఎప్పట్లాగే జరుగుతుంటాయని చెప్పారు. మరికొంత మంది మంత్రులపై వేటు పడుతుందని, రామచంద్రయ్యను కాపాడుకునేందుకు చిరంజీవి సోనియాను కలిశారన్న వార్తలను ప్రస్తావించగా - చిరంజీవికి పార్టీలో ఒక గౌరవం ఉందని, ఆయన సోనియాను కలిస్తే ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారని, మంత్రులను రక్షించుకోవటానికే కలిశారనటం సరికాదని, తనకు తెలిసినంత వరకు ఎవరిపైనా ఇక వేటు ఉండదని ఆయన వివరించారు.
డీఎల్ తొలగింపు ప్రభావం పార్టీపైన, ప్రభుత్వంపైన ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా..ఈ మధ్యకాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల కొద్దిగా బాధ కలుగుతోందని జవాబిచ్చారు. తెలంగాణపై భవిష్యత్లో సమావేశాలు నిర్వహిస్తానని ఆజాద్ ప్రకటించిన సంగతిని గుర్తు చేయగా, వాటి గురించి ఆజాద్ ఇప్పటికే ప్రకటించారని, రాష్ట్రంలో ఉన్న సున్నితమైన సమస్యకు శాశ్వతమైన పరిష్కారం తీసుకొస్తామని ఆయన చెప్పారని అన్నారు.
ఆజాద్ను మార్చాలంటూ ఎమ్మెల్సీ యాదవరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. వీటి గురించి కూడా పార్టీ నాయకులు చెప్పారని, యాదవరెడ్డిని వివరణ కోరతామన్నారు. అవసరమైతే క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. మరి ముఖ్యమంత్రిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన డీఎల్ నుంచీ వివరణ కోరతారా? అని అడగ్గా.. స్పందించేందుకు నిరాకరించారు.
కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు ఎంపిలపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తారా? అని ప్రశ్నిస్తే - కాంగ్రెస్ను ధిక్కరించి, పార్టీ మారిన తర్వాత తామేమి చర్యలు తీసుకుంటామని ఎదురు ప్రశ్న వేశారు. పార్టీ మారిన ఎంపీల గురించి, వారి పదవుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని బొత్స అన్నారు.