సిఆర్పై చిరంజీవి హామీ, అదుపు చేయాలని అధిష్టానం
వట్టి పైన వేటు పడక పోయినా నిత్యం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బహిరంగంగా మాట్లాడి ఇబ్బందులు సృష్టిస్తున్న రామచంద్రయ్యకు మాత్రం పదవి పోవడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చిరంజీవి గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కావడం చర్చనీయాంశమైంది.
సోనియాతో భేటీ అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడుతూ.. రామచంద్రయ్య పదవికి ఢోకా లేదన్నారు. ఆయనను తొలగించే యోచన అధిష్టానానికి లేదని చెప్పారు. 2014లో కాంగ్రెసు పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పథకాలు బాగున్నాయని, పాలన బాగుందని ప్రశంసించారు.
వచ్చే ఎన్నికలలోపే అధిష్టానం తెలంగాణ అంశాన్ని తేల్చేస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తాను సోనియా గాంధీని కలిశానని చెప్పారు.
అదుపులో ఉంచాలి?
రామచంద్రయ్యను అదుపులో ఉంచాల్సిందిగా అధిష్టానం చిరంజీవికి సూచించినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గం నుండి పలువురు తొలగింపు తదితర అంశాలు అధిష్టానం సూచనల మేరకే జరుగుతున్నాయని, మంత్రులు కిరణ్కు సహకరించాలని, పాలన పట్ల, ఆయన పట్ల బహిరంగంగా వ్యతిరేకంగా మాట్లాడవద్దని అధిష్టానం తమను కలిసిన నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. సి.రామచంద్రయ్యను కూడా అదుపులో ఉంచాలని చిరుకు సూచించారని చెబుతున్నారు.