నవ్వుతూ సబితకి జగన్ పలకరింపు:ఏడ్చిన విజయమ్మ

జగన్ పార్టీకి చెందిన కార్యకర్తలు, సబిత వర్గం కార్యకర్తలు కోర్టు హాలు వద్దకు భారీగా తరలి వచ్చారు. విచారణ సమయంలో కొందరు కోర్టు హాలులోకి దూసుకు వచ్చారు. దీంతో కాసేపు కోర్టులో గందరగోళం చెలరేగింది. దీంతో న్యాయమూర్తి కోర్టును పది నిమిషాలు వాయిదా వేశారు. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఓ వర్గం, హాల్లోకి వచ్చిన అనుచరులను బయటకు పంపించాలని మరోవర్గం న్యాయమూర్తిని కోరింది.
జగన్, సబిత నవ్వుతూ పలకరింపులు
కోర్టు హాలుకు వచ్చిన వైయస్ జగన్, సబితా ఇంద్రా రెడ్డిలు పక్క పక్కనే కూర్చున్నారు. ఈ సమయంలో జగన్ నవ్వుతూ సబితను పలకరించారు. బాగున్నారా అని అడిగారు. అందుకు సబిత బాగున్నానని చెబుతూనే.. మీరెలా ఉన్నారని అడిగారు. అందుకు జగన్ తాను బాగున్నానని నవ్వుతూ చెప్పారు. జగన్ మీడియా ప్రతినిధులను కూడా పలకరించారు.
కన్నీళ్ల పర్యంతమైన విజయమ్మ
జగన్ను చూసిన వెంటనే వైయస్ విజయమ్మ కన్నీళ్ల పర్యంతమయ్యారు. విజయమ్మ కంట తడి పెట్టడంతో శోభా నాగి రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, జగన్ ఆమెను ఓదార్చారు. కాగా పది నిమిషాల అనంతరం కోర్టు మరలా ప్రారంభమైంది. విచారణకు సంబంధం లేని వారిని బయటకు వెళ్లాలని జడ్జి ఆదేశించారు.












Click it and Unblock the Notifications