సభకు జగన్ పార్టీ పాదయాత్ర, బిజెపి కండువాతో నాగం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుండి అసెంబ్లీకి పాదయాత్రతో ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. అందుకే అనర్హత వేటు జాప్యమైందన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.
నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశాక చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టారని, ఇప్పుడు ఎమ్మెల్యేల పైన వేటు పడిన తర్వాత అవిశ్వాసమంటూ పలుకుతున్నారని మండిపడ్డారు. కాగా తమ ర్యాలీలో వైయస్సార్ కాంగ్రెసు నేతలు ఇండియా టుడే మేగజైన్ను ప్రదర్శించారు. ఇండియా టుడే గతేడాది రహస్య మిత్రులు పేరిట కథనం రాసింది.
20 రోజులు నిర్వహించాలి: జూలకంటి
అసెంబ్లీ సమావేశాలు పది రోజులు సరిపోవని, ఇరవై రోజులు నిర్వహించాలని జూలకంటి రంగారెడ్డి సూచించారు. విద్యుత్ సమస్యలపై సమగ్రంగా చర్చించాలన్నారు.
ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజా సమస్యలపై నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంబేడ్కర్ విగ్రహం నుండి, గన్ పార్క్ వద్ద తెలుగుదేశం పార్టీ, పాత ఎమ్మెల్యేల క్వార్టర్స్ నుండి బిజెపి ర్యాలీలు నిర్వహించాయి. ఇటీవలె బిజెపిలో చేరిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి బిజెపి కండువాతో అసెంబ్లీలోకి వచ్చారు. బిజెపి ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద గల తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.