గురుశిష్యులే: మోడీ అద్వానీకి ఎలా దూరమయ్యారు?
మోడీ 2011 సెప్టెంబర్ 17వ తేదీన ముస్లింలను ఆకట్టుకోవడానికి మూడు రోజుల సద్భావన దీక్షను చేపట్టారు. ఆ రకంగా ఆయన తన ప్రధానిపై ఉన్న ఆకాంక్షను వెల్లడించారు. అంతేకాకుండా అద్వానీ తలపెట్టిన యాత్ర మీద పైచేయి సాధించారు. అదే ఏడాది అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజు అద్వానీ పోరుబందరు నుంచి అవినీతికి వ్యతిరేకంగా యాత్రను తలపెట్టారు. మోడీ సద్భావన యాత్రతో తీవ్ర అసంతృప్తికి గురైన అద్వానీ జెడియు నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న బీహార్ రాష్ట్రంలోని జయప్రకాష్ జన్మస్థలానికి తన వేదికను మార్చుకున్నారు.
ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సమయంలో 1975లో మోడీ, అద్వానీ కలుసుకున్నారు. జన సంఘ్ అగ్రనేతల్లో ఒకరైన అద్వానీ మోడీ వ్యవస్థాగత వ్యవహారాలపై ఉన్న నైపుణ్యాన్ని గుర్తించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య బంధం కొనసాగుతూ ఉన్నది. అన్ని సమయాల్లోనూ అద్వానీ మోడీ వెంట ఉన్నారు. 1987లో అహ్మదాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి పెట్టడం ద్వారా మోడీ ముందుకు వచ్చారు.
ఆ తర్వాత 1991లో లోకసభ ఎన్నికల్లో గాంధీనగర్నుంచి పోటీ చేయడానికి అద్వానీని మోడీ ఒప్పించారు. అప్పటి వరకు ఆ నియోజకవర్గం నుంచి శంకర్ సింఘ్ వాఘేలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాఘేలాను పక్కకు తప్పించే ప్రయత్నంలో భాగంగానే అద్వానీని మోడీ ముందుకు తెచ్చారు.
బిజెపికి గుజరాత్లో పునాదులు ఏర్పాటు చేసిన మోడీ దాదాపుగా అదే సమయంలో మోడీ అద్వానీ రామ రథయాత్రకు శ్రీకారం చుట్టారు. సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ఈ రథయాత్ర చేపట్టారు. బిజెపి మెజారిటీ సాధించి గుజరాత్లో అధికారంలోకి వచ్చింది. తద్వారా మోడీ పార్టీ వ్యవస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యేలా చూశారు.
కేశూబాయ్ పటేల్ ప్రభుత్వాన్ని మోడీ వెనక నుంచి నడిపిస్తున్నారనే విమర్శలను ఎదుర్కున్నారు. పార్టీలోని ఓ వర్గం మోడీని సూపర్ సిఎంగా కూడా అభివర్ణించింది. వాఘేలా నాటకీయ ఖజరహో తిరుగుబాటు వరకు మోడీపై వస్తున్న విమర్శలను అద్వానీ తిప్పికొట్టారు. చివరకు 1996లో కేశూ భాయ్ పటేల్ ప్రభుత్వం పడిపోయింది.
దాంతో మోడీని గుజరాత్ నుంచి అస్సాంకు పంపించాలని బిజెపి అగ్రనేతలు భావించారు. అద్వానీ జోక్యం చేసుకుని పంజాబ్ - హర్యానా - హిమాచల్ ప్రదేశ్లను నిర్దేశించారు. కేశూభాయ్ పటేల్ మళ్లీ 1998లో అధికారంలోకి వచ్చారు. అయితే, ఆయనకు ప్రకృతి సహకరించలేదు. కరువులు, కాండ్లా తుఫాను, కచ్ భూకంపం గుజరాత్లో బిజెపి ప్రభుత్వాన్ని వణికించింది. ఆ తర్వాత బిజెపి వరుసగా జరిగిన ఐదు శాసనసభ ఉప ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. దాంతో అద్వానీ తన శిష్యుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టేలా చూశారు. అప్పటి వరకు కేవలం వ్యూహకర్తగా ఉన్న మోడీ 2001 అక్టోబర్లో మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
2002 అల్లర్ల తర్వాత కూడా అద్వానీ మోడీకి బాసటగా నిలిచారు. ఎబి వాజ్పేయి మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని చూశారు. అయితే, అద్వానీ మోడీకి వాజ్పేయి ఎదుటనే కాకుండా పార్లమెంటులో కూడా అండగా నిలిచారు. 2009 ఎన్నికలకు ముందు నుంచి గురుశిష్యుల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి.