బయ్యారంపై టిడిపి, తెలంగాణపై టిఆర్ఎస్: సభ వాయిదా
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన తెలుగుదేశం, తెలంగాణపై భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై వైయస్సార్ కాంగ్రెసు, అంగన్ వాడి సమస్యలపై సిపిఎం, విద్యుత్ ఛార్జీల పెంపు, సర్ఛార్జిలపై మజ్లిస్ పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి.
వాయిదా తీర్మానాలు తిరస్కరించడంతో టిడిపి, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టాయి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చించాలని టిడిపి, తెలంగాణపై తీర్మానం చేయాలని తెరాస పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.
అంతకుముందు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల పొట్టకొట్టేలా నాడు వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవహరించారని ఆరోపించారు. టిడిపి పోరాటం వల్లే రక్షణ స్టీల్స్కు బయ్యారం గనులు కేటాయింపు రద్దయిందని టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.