ప్రజాభీష్టం మేరకు ఏదో ఒక పార్టీనుండి పోటీ: కృష్ణంరాజు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వివాహం వచ్చే ఏడాది ఉంటుందని కృష్ణం రాజు అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రభాస్ హీరోగా నిర్మించే సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నట్లు రెబల్ స్టార్ చెప్పారు. కృష్ణం రాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా కృష్ణం రాజు గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆయన కేంద్ర సహాయ మంత్రిగా అటల్ బిహారీ వాజపేయి హయాంలో పని చేశారు. 2004 తర్వాత కూడా ఆయన బిజెపిలో కొనసాగారు. ఆ తర్వాత క్రమంగా బిజెపికి దూరమయ్యారు. 2008లో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో అందులో చేరారు.
2009 సాధారణ ఎన్నికలలో రాజమండ్రి నుండి చిరంజీవి పార్టీ తరఫున పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి మురళీ మోహన్, కాంగ్రెసు నుండి ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఇద్దరు నటులు ఓడిపోయి, ఉండవల్లి గెలుపొందారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో కృష్ణం రాజు ప్రజారాజ్యం పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు జగన్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.