డ్రామాలొద్దు: కిరణ్ ఆగ్రహం, అవమానించారని తెరాస
తమను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవమానిస్తున్నారని తెరాస శానససభ్యులు మండిపడ్డారు. చలో అసెంబ్లీకి అనుమతి కోరినా ముఖ్యమంత్రి స్పందించడం లేదని వారు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. తాము డ్రామాలు ఆడుతున్నామంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం హేయమని వారన్నారు.
అహంకారంతో, అహంభావంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని శానససభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఉప నేత హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రిని తాము చూడలేదని వారన్నారు. ప్రతిపక్షాలకు దర్నా చేసే హక్కు ఉందని వారన్నారు.
తెలంగాణ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస శాసనసభ్యులు అంతకు ముందు శాసనసభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించినా వారు వినలేదు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. రెండు సార్లు శానససభ వాయిదా పడింది.
నీలం తుఫాన వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, గత నాలుగేళ్లుగా వడగళ్ల వానలతో నష్టపోయిన రైతలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఛేంబర్ వద్ద బైఠాయించిన తెరాస శాసనసభ్యులు డిమాండ్ చేశారు. తన ఛేంబర్ వద్ద బైఠాయించిన శాసనసభ్యులను దాటుకుంటూ ఆయన ఛేంబర్లోకి వెళ్లిపోయారు.