కిరణ్ కుమార్ రెడ్డి క్లియర్: తెలంగాణ పోరుపై కఠినమే
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం పట్ల కఠినంగానే వ్యవహరించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 14వ తేదీన తెలంగాణ జెఎసి తలపెట్టిన చలో అసెంబ్లీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్లు చెబుతున్నారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ మంత్రులు కోరినప్పటికీ ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తెలంగాణ ఇవ్వకుండానే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉద్యమంపై ఉక్కుపాదం మోపాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
చలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసినట్లేనని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం వ్యాఖ్యానించారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంపై అత్యుత్సాహంతో నానా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ మాటలను బట్టి తెలంగాణ ఉద్యమం పట్ల ముఖ్యమంత్రి వైఖరి ఏమిటో స్పష్టమైపోతుందని అంటున్నారు.
తెలంగాణ ఉద్యమం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వ్యవహారంగానే సాగుతోందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తెలంగాణ జెఎసి కూడా తెరాస రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందనే భావనతో ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కెసిఆర్ను ఎదుర్కోవడానికి తెలంగాణ ఉద్యమం పేరుతో చేపట్టే కార్యక్రమాల పట్ల ఉదాసీనంగా వ్యవహరించకూడదని కాంగ్రెసు నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

తెరాసలోకి వెళ్లాలని అనుకునేవారిని కూడా ఆపకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ చెప్పినట్లుగా తెరాసలోకి పెద్ద యెత్తున వలసలు ఉండవని అనుకుంటున్నారు. తెరాసలోకి వెళ్లింది ఇద్దరు ఎంపీలే కదా అని ఇటీవల కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అనడాన్ని బట్టి ఆ విషయం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సెంటిమెంటు బలంగా పనిచేస్తున్నా అది ఎన్నికలకు వచ్చే సరికి ఏకపక్షంగా తెరాస వైపు వెళ్లదని అంటున్నారు. ఓ వైపు బిజెపి తెలంగాణలో బలం పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల తెలంగాణ ఓటు చీలే అవకాశం ఉందని అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం కార్యక్రమాలను అడ్డుకోవడం వల్ల పెద్ద యెత్తున ప్రతిఘటన ఎదురవుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించడం లేదు.
తెరాస కార్యలాపంగా మాత్రమే తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం తటస్థ శక్తులు ఉద్యమంలోకి రావడానికి వెనకాడుతాయని కాంగ్రెసు నాయకత్వం అంచనాలు వేస్తోంది. కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కూడా ఒక్కటిగా లేరని, వివిధ సంఘాల కింద చీలిపోయారని, కెసిఆర్ ఉద్యమానికి గానీ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జెఎసి ఉద్యమానికి గానీ మూకుమ్మడిగా విద్యార్థులు మద్దతు ప్రకటించే స్థితి లేదని అనుకుంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మెల్లమెల్లగా తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ముందుకు వస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications