వైయస్ భారతి వర్సెస్ షర్మిల: ఎంత వరకు నిజం?
పాదయాత్ర ద్వారా పార్టీపై పట్టు సాధించేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని, జగన్ తర్వాతి స్థానం ఆక్రమించాలని చూస్తున్నారని, కడప పార్లమెంటు సీటు కోసం పట్టుబడుతున్నారని, దానికి అంగీకరిస్తేనే పాదయాత్ర చేస్తానని షర్మిల చెప్పినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అయితే, అందులో ఏ మాత్రం నిజం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఒక్కటై తమనే లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో కుటుంబంలో అంతర్గత కలహాలు పెట్టుకోవడం ద్వారా నష్టపోకూడదనే అవగాహనతో వారు పనిచేసుకుంటూ పోతున్నట్లు చెబుతున్నారు.
షర్మిల పట్ల తనకు ఏ విధమైన వ్యతిరేకత లేదని వైయస్ భారతి చెబుతున్నారట. తన భర్త కోసం వందలాది కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడిన షర్మిల రుణం తీర్చుకోవడం కూడా తన వల్ల కాదని, ఎట్టి పరిస్థితిలోనూ షర్మిలను వ్యతిరేకించే పరిస్థితి ఉండదని, పైగా ఆమెకు రుణపడి ఉంటానని భారతి అంటున్నట్లు చెబుతున్నారు. అయితే, భారతి జాతీయ మీడియాకే కాకుండా తెలుగు టీవీ చానెళ్లకు కూడా ఇటీవల ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ స్థితిలో ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగింది.
తమ అత్తను ముందు పెట్టి కుటుంబ సభ్యులమైన తాము తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నామే తప్ప ఆధిపత్య పోరుకు, అంతర్గత తగాదాలకు అసలు చోటు లేదని భారతి చెబుతున్నట్లు సమాచారం. ఆమె తన సన్నిహితుల వద్ద మనసు విప్పి మాట్లాడుతున్నారని అంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను ఎదుర్కుని వచ్చే ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చి పెట్టడమే తమ బాధ్యతగా కుటుంబ సభ్యులంతా అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
అయితే, జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని మాత్రం అంతగా కలుపుకుని పోవడం లేదనే ప్రచారం సాగుతోంది. జగన్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెసు వైపు వెళ్లడం కుటుంబ సభ్యులకు నచ్చలేదని అంటున్నారు. అయితే, వివేకానంద రెడ్డి కూడా వైయస్ జగన్ను వదిలి మరో వైపు వెళ్లే పరిస్థితిలో లేరని కూడా అంటున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులే తమ కుటుంబంలో అంతర్గత విభేదాలున్నాయనే ప్రచారం సాగిస్తున్నారని భారతి స్పష్టంగానే చెబుతున్నట్లు సమాచారం. ఏమైనా, వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వచ్చే ఎన్నికలు అగ్నిపరీక్షనే.