మేమే గెలుస్తాం: విజయమ్మ లోకల్ పోల్స్ నగారా
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు తధ్యమని విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయానికి కార్యకర్తలే మూలమని అన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామ పంచాయతీలన్నీ కైవసం చేసుకోవాలని సూచించారు.
అధికార పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడకుండా చూడాలని ఆమె సూచించారు. స్థానిక సమస్యలపై కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. తమ పార్టీ అవతరించిన తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ తమదే విజయమని ఆమె అన్నారు. వైయస్ జగన్ను దెబ్బ తీయడమే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల లక్ష్యమని విజయమ్మ అన్నారు. ఆరెండు పార్టీల ఎత్తుగడలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. తమ పార్టీ సత్తా ఏమిటో చూపేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఓ అవకాశమన్నారు. అంతకు ముందు సభా ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు.