కెసిఆర్ తెలంగాణ ద్రోహి, నమ్మడం లేదు: మోత్కుపల్లి

కెసిఆర్ను తెలంగాణ ద్రోహిగా ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అభివర్ణించారు. కెసిఆర్ ఒంటెత్తు పోకడలను ప్రజలు గమనిస్తున్నారని, కెసిఆర్ కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారని, శనివారంనాటి బంద్ విఫలం కావడమే దానికి నిదర్శనమని ఆయన అన్నారు. బంద్ను విఫలం చేసి తాము కెసిఆర్ విధానాలకు వ్యతిరేకమని ప్రజలు చెప్పారని ఆయన అన్నారు. కెసిఆర్పై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు.
కెసిఆర్ వల్లనే తెలంగాణ రావడం లేదని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో కుమ్మక్కయి కెసిఆర్ తెలంగాణను అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. రేపు, ఎల్లుండి తెలంగాణ వస్తుందని చెప్పడం వల్ల వేయి మంది విద్యార్థులు బలయ్యారని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెను కెసిఆర్ అమ్ముకున్నారని ఆరోపించారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి తెరాస కార్యకర్తలు రాలేదని ఆయన అన్నారు. ఫామ్ హౌస్లో ఉండి కెసిఆర్ బంద్కు పిలుపునిచ్చారని ఆయన అన్నారు. గత 12 ఏళ్లుగా కెసిఆర్ చేస్తున్న ప్రకటనలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు.
వాపును చూసి కెసిఆర్ బలుపు అనుకుంటున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ రెచ్చగొట్టే ప్రకటనల వల్ల వేయి మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. టికెట్ ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేయడంతో నాగరాజు అనే తెరాస కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేస్తూ డబ్బుల కోసం ఎంత మందిని చంపుతావని, ఎన్నాళ్లు మోసం చేస్తావని మోత్కుపల్లి కెసిఆర్ను అడిగారు. భవిష్యత్తులో కెసిఆర్కు పుట్టగతులుండవని అన్నారు.
దమ్ము ధైర్యం ఉంటే కెసిఆర్ పార్లమెంటును ముట్టడించాలని ఆయన సవాల్ చేశారు. సోనియా వద్ద డబ్బులు తెచ్చుకున్నారు కాబట్టే పార్లమెంటును ముట్టడించే ధైర్యం కెసిఆర్కు లేదని, తెలంగాణ కావాలని అడగరని ఆయన అన్నారు. టికెట్ కోసమే కుమారుడికి తారకరామారావు అని పేరు పెట్టుకున్నారని ఆయన కెసిఆర్పై ధ్వజమెత్తారు. కెసిఆర్ది నాలుకా, తాటిమట్టా అని ఆయన అడిగారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని సీమాంధ్ర నాయకుడంటూ వ్యతిరేకించడాన్ని ఆయన తప్పు పట్టారు. తమ పార్టీ తెలంగాణ కోసం కట్టుబడి ఉందని, తమ పార్టీతోనే తెలంగాణ వస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications