స్వామీ యే శరణం అయ్యప్పా: శబరిమలలో శ్రీశాంత్
తాను ఏ తప్పూ చేయలేదని శ్రీశాంత్ ఈ సందర్భంగా చెప్పాడు. గతంలో చిన్నపాటి లోపాలు తన వైపు జరిగి ఉండవచ్చునన, తాజా కేసులో మాత్రం తాను నిర్దోషినని అన్నాడు. తాను నిర్దోషిగా బయటపడుతాననే నమ్మకం ఉందని అతను దీమా వ్యక్తం చేశాడు. శబరిమలలో ప్రార్థనలు చేసిన తర్వాత అతను మీడియాతో మాట్లాడాడు.
అయ్యప్ప స్వామి ఆశీస్సులతో తాను నిర్దోషిగా బయటకు వస్తానని, ఇక కొత్త శ్రీశాంత్ను చూస్తారని అన్నాడు. శ్రీశాంత్ వెంట తండ్రి శాంతకుమారన్ నాయర్, ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం అతను శబరిమల వచ్చాడు. అతను ఐదు కిలోమీటర్ల నడిచి ఆలయానికి చేరుకున్నాడు.
శ్రీశాంత్ శుక్రవారం అరటిపండ్లతో తులాభారం తూగాడు. శ్రీపూర్ణత్రయీశ వైష్ణవ ఆలయంలో ఈ మొక్కు తీర్చుకున్న విషయం తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్, అంకిత్ చవాన్ జూన్ 11వ తేదీన బెయిల్పై విడుదలయ్యారు. వీరితో పాటు రాజస్థాన్ రాయల్స్ మరో క్రికెటర్ అజిత్ చండిల కూడా అరెస్టయ్యాడు.