విజయమ్మకు పార్టీ విభేదాల సెగ: దాడి, కొణతాల దూరం
ఈ సమయంలో విజయమ్మకు స్వాగతం పలికేందుకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి రాలేదు. ఇటీవలె తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన దాడి వీరభద్ర రావు పట్ల కొణతాల వర్గం ఆసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయమ్మ పర్యటన సమయంలో కొణతాల దూరంగా ఉండటంతో జిల్లా పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. సబ్బం హరి కూడా దూరంగా ఉన్నారు. మరోవైపు దాడి వీరభద్ర రావు కూడా స్వాగతం పలికేందుకు రాలేదు.
కాగా, ప్రాంతీయ సదస్సులో విజయమ్మ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు అందరు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల నుండి ఎమ్మెల్యే ఎన్నికల వరకు కార్యకర్తలంతా కలిసి పని చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురాలన్నారు. పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు, నేతలు అందరు కలిసి పని చేయాలన్నారు. చిన్న చిన్న గొడవలు ఉన్నా పట్టించుకోకుండా పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు.
రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. మనం మంచి ఊపుమీద ఉన్నామనే అతివిశ్వాసం వద్దని, రాష్ట్రంలో పార్టీకి మంచి ఆదరణ ఉందన్నారు. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలన్నారు. మనకు మంచి రోజులు వస్తున్నాయన్నారు.