బొత్స పదవికి ఎసరు: పిసిసి చీఫ్ వైపు మొగ్గుచూపినా..

అవకాశముంటే బొత్స... మంత్రి పదవిని త్యజించి పిసిసి చీఫ్గానే కొనసాగుతారు. అయితే కిరణ్ వర్గం ఆయనను పిసిసి చీఫ్గా తొలగించే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రమంత్రులు అజయ్ మాకెన్, జోషీలను మంత్రి పదవుల నుంచి తప్పించి అదిష్టానం పార్టీ పదవులను కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో బొత్స వ్యవహారంలో ఏమి జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. ఆయన పిసిసి అధ్యక్షుడిగా పార్టీకి సేవలందిస్తారా? లేక మంత్రి వర్గంలో కొనసాగుతూ ప్రభుత్వానికి సేవలందిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ అంశంపై బొత్స కూడా బాహాటంగానే తన వైఖరిని స్పష్టం చేస్తూ వస్తున్నారు. తాను పార్టీకే పరిమితమవుతానని చెబుతున్నారు. జైపూర్ డిక్లరేషన్ మేరకు పిసిసి అధ్యక్షులు రాష్ట్రమంతా తిరగాల్సి ఉన్నందున 2014 ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ పదవిలో కొనసాగేందుకే మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. పార్టీ సేవకే పరిమితమవుతానని తాను ఇప్పటికే అధిష్ఠానానికి స్పష్టం చేశానని సత్తిబాబు వ్యాఖ్యానించారు. ఆయితే ఆయన వ్యతిరేక వర్గం మాత్రం ఆయనను చీఫ్గా తొలగించే ప్రయత్నాలు చేస్తోంది. బొత్స ఏ పదవిలో కొనసాగుతారనేది అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంది.
సమావేశాల తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రి!
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. ఎన్నికలకు మరో పది నెలల గడువు ఉన్న సమయంలో రాష్ట్రంలో మార్పులు చేర్పులపై ఆయన అధిష్టానంతో చర్చించనున్నారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సబిత, ధర్మానలు రాజీనామా, డిఎల్ బర్తరఫ్ నేపథ్యంలో వారి స్థానంలో తన వర్గానికి చెందిన వారిని తీసుకోవాలని కిరణ్ చూస్తున్నారు. అలాగే మరికొందర్ని తప్పించాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications