జగన్తో లింక్ లేదు: సాక్షి డైలీపై కిరణ్ మండిపాటు
వైయస్ జగన్ కేసులో తమ మంత్రులపై వచ్చిన ఆరోపణలపై తాను చెప్పిన మాటలను వక్రీకరిస్తూ తాను కేసే లేదన్నట్లుగా మాట్లాడినట్లు సాక్షి డైలీ చిత్రీకరించిందని ఆయన అన్నారు. తాము ఒక పార్టీలోనే కొనసాగుతామని, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి హయాంలోని ఐఎంజి వ్యవహారాన్ని తానే సభలో లేవనెత్తానని, ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు సిఫార్సు చేసిందని, సిబ్బంది లేకపోవడంతో సిబిఐ దాన్ని దర్యాప్తునకు తీసుకోలేదని, ఇప్పటికి కూడా సిబిఐ దర్యాప్తునకు అడగవచ్చునని ఆయన అన్నారు.
తాను సీనియర్ సభ్యుడిని అంటే సరిపోదని, సభలో వారి నుంచి కొత్త సభ్యులు నేర్చుకునే విధంగా ఉండాలని ఆయన అన్నారు. పరస్పరం దూషించుకుంటున్నప్పుడు మన స్థాయిని తగ్గించుకుంటున్నామని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. చార్జిషీట్లలో తమ పేర్లను సిబిఐ చేర్చిన తర్వాత మంత్రులు రాజీనామాలు చేశారని ఆయన అన్నారు. క్విడ్ ప్రోకో అంశం మంత్రులపై రాలేదని, మంత్రులు తీసుకున్న నిర్ణయాల వల్ల వేరేవారికి లబ్ధి చేకూరిందనే అంశంపై చర్చ సాగుతోందని తాను చెప్పినట్లు ఆయన వివరించారు. తాను వేరేవాళ్ల ప్రస్తావన తేలేదని ఆయన చెప్పారు. అయినా సాక్షి డైలీ తన మాటలను వక్రీకరించిందని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయని, ఈ స్థితిలో పెట్టుబడులు తీసుకోవడం నైతికమా, అనైతికమా అనే చర్చ సాగుతోందని ఆయన అన్నారు. మంత్రులు ప్రలోభాలకు లోను కాలేదని, మంత్రులకు ఆ విషయంలో మేళ్లు జరగలేదని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. తాను జగన్ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులపై మాట్లాడలేదని చెప్పారు.
ముఖ్యమంత్రి వివరణ తర్వాత మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బంగారుతల్లి పథకం బిల్లును శాసనసభలో ప్రతిపాదించారు.