తెలంగాణ: ఢిల్లీ పెద్దలకు టి, సీమాంధ్ర నేతల హెచ్చరికలు

మరికొందరు నేతలు రాష్ట్రానికి చెందిన పలువురి నేతలతో తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు భారీ ప్యాకేజీ, రాయల తెలంగాణ తదితర అంశాలపై నేతలు సమాలోచనలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఉత్తరాఖండ్ పరిస్థితి మెరుగుపడ్డాక అధిష్టానం పెద్దలు పూర్తిస్థాయిలో చర్చలు జరిపి ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వస్తే తమ కార్యాచరణ ఉంటుందని సీమాంధ్ర నేతలు చెబుతుంటే, అధిష్టానం తెలంగాణపై మాట నిలబెట్టుకోవాలని తెలంగాణ ప్రాంత నేతలు కోరుతున్నారు.
కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆదివారం మాట్లాడుతూ... అధిష్టానం తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణపై చర్చలు కొనసాగుతున్నాయని, ఆంధ్రా ప్రాంతంలో కూడా కొన్ని వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ వస్తుందని, తెలంగాణ ప్రకటనతో పాటు వెనుక బడిన ప్రాంతాలకు ప్యాకేజ్ ఉంటుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇటు అల్టిమేటం అటు హెచ్చరికలు
తెలంగాణ ప్రాంత నేతలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఇటీవల ఏకమవుతున్నారు. వారు ఈ నెల 30వ తేదిన హైదరాబాదులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, అధిష్టానానికి తెలంగాణ ఆకాంక్షను తెలియజేయాలనుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసుకు, తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పనున్నారు.
ఇప్పటికే పలువురు నేతలు తెలంగాణ ఇవ్వకుంటే తాము వచ్చే ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితి లేదని, గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ రోజు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి.. అధిష్టానం పెద్దలకు ఏమాత్రం తెలివి ఉన్నా తెలంగాణ ఇచ్చే వారని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు సీమాంధ్ర నేతలు ప్రస్తుతానికి కూల్గానే ఉన్నప్పటికీ.. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉంటే మాత్రం ఏకమవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. వారి పరోక్షంగా అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications