ఫ్యామిలీతో కొట్టేందుకు: జగన్ బాబాయ్కి కాంగ్రెస్ గాలం?
సెంటిమెంట్ కారణంగానే జగన్ పార్టీ మనగలుగుతుందని చెప్పినా, మరేం చెప్పినా ఆ పార్టీ కాంగ్రెసు పార్టీకి సవాల్గా నిలిచింది. జగన్ పార్టీ కారణంగా టిడిపి కంటే కాంగ్రెసు పార్టీయే ఎక్కువ నష్ట పోనుంది. టిడిపి నేతలు కొంతమంది జగన్ పార్టీ వైపు వెళ్లినా, మాతృపార్టీని చీల్చడం ద్వారా కాంగ్రెసుకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ప్రధానంగా కడప జిల్లాలో కాంగ్రెసు పార్టీకి అభ్యర్థులు దొరికే పరిస్థితే లేదని చెబుతున్నారు.
దీంతో కాంగ్రెసు జగన్ను 'కుటుంబ రాజకీయం'తో దెబ్బ కొట్టాలని చూస్తోందట. గత ఉప ఎన్నికలలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పైన కాంగ్రెసు పార్టీ జగన్ బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని నిలిపింది. ఆ ఎన్నికల్లో వివేకా ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీని వీడి తనయుడి వైపుకు వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెసు జగన్ను కడప జిల్లాలో దెబ్బ కొట్టేందుకు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులకు గాలం వేస్తోందట.
అందులో భాగంగా జగన్ మరో బాబాయిని దువ్వుతోందట. జగన్ బాబాయి సోదరుడు అవినాష్ రెడ్డి వచ్చే ఎన్నికలలో కడప పార్లమెంటు స్థానం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిని విస్మరించి మరీ జగన్ బాబాయిని కాంగ్రెసు పార్టీ దువ్వుతోందని ప్రచారం సాగుతోంది. అయితే ఆయన మాత్రం జగన్ను వదిలి వచ్చేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు.