ఆవిడా మా ఆవిడే!: ఒకేచోట ఇద్దరు యువతులతో పెళ్లి
జైపూర్: రాజస్థాన్లో ఇద్దరు యువతులు ఓకే యువకుడిని పెళ్లి చేసుకున్నారు. సినిమా టిక్లో ఒకే యువకుడిని ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవడమే కాకుండా, ఆ ఇద్దరు యువతుల పేర్లలో రేఖ ఉండటం గమనార్హం. ఇరవై అయిదేళ్ల ఆ యువకుడు ట్రైబల్ వ్యక్తి.
రాజస్థాన్లోని ఉదయపూర్కు యాభై కిలోమీటర్ల దూరంలోని ఝాలోల్ సమీపంలోని మకదాదేవ్ గ్రామానికి చెందిన యువకుడు అతను. ఇద్దరు యువతులు అతనిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించారు. భగవతి లాల్ అనే గ్రాడ్యుయేట్ స్థానికంగా ఉంటున్న ట్రైబల్ యువకుడు.
ఇతను గత నాలుగేళ్లుగా రేఖా కుమారి అనే యువతితో సంబంధం కలిగి ఉన్నాడు. రేఖా కుమారి ఆ పక్కనే ఉన్న చత్రపుర గ్రామానికి చెందిన యువతి. వీరిద్దరు తరుచూ గ్రామంలో కలుసుకునేవారు. వీరి మధ్య ప్రేమాయణం గ్రామస్థులకు తెలుసు. వారు పెళ్లి చేసుకుంటారని గ్రామస్థులు ముచ్చటించుకునేవారట.
ఆరు నెలల క్రితం భగవతి లాల్ సమీపంలోని మరో గ్రామానికి చెందిన రేఖ అనే యువతిని కలుసుకున్నాడు. ఆమె పట్ల కూడా అతనికి ఆరాధ్యభావం ఏర్పడింది. తాను ఇద్దర్నీ ప్రేమిస్తున్నట్లుగా భగవతీ భావించాడు. ఇద్దరు యువతులు అతని వద్దకు వచ్చి పెళ్లి కోసం పట్టుబట్టారు.
దీంతో అతను ఇద్దరు యువతులను ఫేస్ టు ఫేస్ తీసుకు వచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఇరువురితో కలిసి భగవతి మాట్లాడాడు. ఇద్దరు కలిసి ఒకే మండపంలో అతనిని పెళ్లి చేసుకునేందుకు ఆ యువతులు అంగీకరించినట్లుగా భగవతి సోదరి చెప్పారు. ఇద్దరు యువతులు పాఠశాల స్థాయి కూడా పూర్తి చేయలేదని చెబుతున్నారు.