రాయల తెలంగాణ: మైనస్ జగన్, ప్లస్ చిరు (ఫొటోలు)
హైదరాబాద్: రాష్ట్ర విభజకు కాంగ్రెసు అధిష్టానం సానుకూలంగా ప్రతిస్పందిస్తూనే రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీమాంధ్రకు చెందిన కొంత మంది నాయకులే కాకుండా రాయలసీమకు చెందిన నాయకులు కూడా ఈ వైపు కొంత సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రాబల్యాన్ని సీమాంధ్రలోనూ తెలంగాణలోనూ కట్టడి చేయడానికి రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉపకరిస్తుందని రాయలసీమకు చెందిన కొంత మంది నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రాంతాన్ని రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను తొలుత ముందుకు తెచ్చింది అనంతపురం జిల్లాకు చెందిన జెసి దివాకర్ రెడ్డి అని చెబుతారు. రాయలసీమలో వైయస్ జగన్ ప్రాబల్యాన్ని రెండుగా చీల్చడానికి ఇది పనికి వస్తుందని, దీనివల్ల జగన్ రెండు ప్రాంతాల్లోనూ మైనారిటీలో పడిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

కాంగ్రెసు అధిష్టానం రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను మొదట ముందుకు తెచ్చింది అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అంటున్నారు. వైయస్ జగన్ ప్రాబల్యం నుంచి బయట పడడానికి కర్నూలు, అనంతపురం జిల్లాల నాయకులు అందుకు అంగీకరిస్తున్నట్లు చెబుతున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి రఘువీరా రెడ్డి కూడా రాయల తెలంగాణకు అంగీకరించే అవకాశాలున్నాయి. నిజానికి, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతూనే కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు.

కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

హైదరాబాదులో ప్రాబల్యం చాటుకుంటున్న మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణను వ్యతిరేకిస్తూనే రాయల తెలంగాణకు అంగీకరిస్తామని చెబుతున్నారు. పార్టీని ఇతర జిల్లాలకు కూడా విస్తరించడానికి దీని వల్ల ఉపయోగం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. బిజెపి ప్రాబల్యంలోకి రాకుండా ఇది ఉపయోగపడుతుందని ఆయన అనుకుంటున్నారు.

రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్ర రాష్ట్రంలోకి వెళ్లిపోతారు. దీనివల్ల తమకు తలనొప్పి వదులుతుందని అనంతపురం, కర్నూలు కాంగ్రెసు నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ప్యాకేజీకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆయన రాజకీయ జీవితం కష్టాల్లో పడే అవకాశం ఉంది.

రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే కోస్తాంధ్ర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిరంజీవి ఇమేజ్ ఆ ప్రాంతంలో పనికి వస్తుందని కాంగ్రెసు నాయకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ, కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి వంటి నేతలతో సీమాంధ్రలో ప్రాబల్యం చాటుకోవచ్చునని కాంగ్రెసు అభిమతంగా చెబుతున్నారు.

రాష్ట్ర విభజనకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మూలకారణంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ను రాజకీయంగా బలహీనపరిచే దిశలో రాయల తెలంగాణకు మొగ్గు ఉందని అంటున్నారు.
తెలంగాణలో అంతంత మాత్రంగానే జగన్ ప్రాబల్యం కొనసాగుతోంది. దీనివల్ల అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జగన్ సీట్లు గెలుచుకున్నా రాయల తెలంగాణలో పూర్తి మెజారిటీనీ సాధించలేరని అంచనా వేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడితే ఆ రెండు జిల్లాల్లోని ప్రజలు కూడా పునరాలోచనలో పడి జగన్కు మద్దతు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. కడప జిల్లాకు చెందిన వైయస్ జగన్ సీమాంధ్ర రాష్ట్రానికి పరిమితం కావాల్సి వస్తుందని కూడా అంటున్నారు.
సీమాంధ్రలో జగన్ను ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలను రచించుకోవచ్చుననేది కాంగ్రెసు నాయకుల అంచనాగా తెలుస్తోంది. కోస్తాంధ్రలో చిరంజీవి ద్వారా, బొత్స సత్యనారాయణ ద్వారా జగన్ను ఎదుర్కోవచ్చునని భావిస్తున్నారు. అలాగే, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, జెడి శీలం వంటివారిని సీమాంధ్రలో రంగంలోకి దించితే జగన్ బలాన్ని తగ్గించవచ్చునని అంచనా వేస్తున్నారు.
కర్నూలు, అనంతపురం జిల్లాలను మినహాయిస్తే చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమ జిల్లాల్లో తన ప్రభావాన్ని చూపవచ్చునని అంటున్నారు. పైగా, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రాయల తెలంగాణకు పచ్చజెండా ఊపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా తెలంగాణను మినహాస్తే మైనారిటీలోకి నెట్టవచ్చునని చెబుతున్నారు.
కానీ, తెలంగాణ నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదనకు విముఖంగా ఉన్నారు. స్వయం పాలన పేరుతో ముందుకు వస్తున్న వాళ్లు తాము ఆధిపత్యంలోకి రావడం కష్టమనే భావనతో దాన్ని వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications