రాయల తెలంగాణ: జగన్, కెసిఆర్పై కాంగ్రెస్ లెక్కలు?
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ 2014లో ఆంధ్రప్రదేశ్లో మరోసారి విజయకేతనం ఎగురవేసేందుకు లెక్కలు వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇటు తెలంగాణ, అటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు సమస్యగా మారడంతో ఈ రెండింటిని సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తీసుకు వచ్చిందని అంటున్నారు.
రాయల తెలంగాణ ప్రకటిస్తే కాంగ్రెసు పార్టీయే ఎక్కువగా లబ్ధి చెందే అవకాశాలున్నాయని అధిష్టానంతో పాటు, తెలంగాణ, సీమాంధ్ర నేతలు కూడా అభిప్రాయపడుతున్నారట. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా 2014 ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు లేవని తెలంగాణ కాంగ్రెసు నేతలతో పాటు, సీమాంధ్ర నేతలు కూడా అధిష్టానానికి చెబుతున్నారు. నిర్ణయమేదైనా, సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
దీంతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం 2014 ఎన్నికలలో ఎపిలో ఎక్కువ సీట్లను కైవసం చేసుకునే కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. అందులో భాగంగా రాయల తెలంగాణ అయితే ఎక్కువ సీట్లు కాంగ్రెసు గెలుచుకునే అవకాశముంటుందంటున్నారు.
తెలంగాణవాదులు డిమాండ్ చేసినట్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే ఆ క్రెడిట్ తమకు దక్కినా ఓట్ల విషయానికి వచ్చేసరికి వేరుగా ఉంటుందని భావిస్తున్నారట. తెలంగాణను ఇచ్చినా తెలంగాణ కోసం పోరాడుతున్న తెరాస, బిజెపిలు కూడా ఇందులో లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయని అధిష్టానం భావిస్తుందట. తమ వల్లే తెలంగాణ వచ్చిందని ఆ పార్టీలు చెప్పుకుంటాయని, తద్వారా కాంగ్రెసుకు అది నష్టం చేస్తుందని భావిస్తున్నారట. అదే సమయంలో సీమాంధ్రలో జగన్ ప్రభావం వల్ల పార్టీ కనుమరుగయ్యే అవకాశముంది.
రాయల తెలంగాణ ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలను కొంత శాంతింప చేసినట్లవుతుందని, అదే సమయంలో రాయల తెలంగాణ, రాయల ఆంధ్ర వల్ల సీమాంధ్రలో పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చునని భావిస్తున్నారంటున్నారు. ఇలా విభజించడం వల్ల రాయల తెలంగాణలో రెడ్లను, రాయల ఆంధ్రాలో కాపులను మచ్చిక చేసుకొని, తద్వారా కెసిఆర్, జగన్లకు చెక్ పెట్టవచ్చునని భావిస్తున్నారని అంటున్నారు. ఇక విభజన ద్వారా చంద్రబాబును ఇరు ప్రాంతాల్లో దెబ్బతీయవచ్చునని భావిస్తున్నారట.
విభజన ద్వారా కొంత సానుకూలత, ఆయా ప్రాంతాలలోని సామాజిక వర్గాలను మచ్చిక చేసుకోవడం ద్వారా ఇంకొంత సానుకూలత కాంగ్రెసు వైపు ఉంటుందని కాంగ్రెసు భావిస్తోందని అంటున్నారు. ఎలా చూసినా రాయల తెలంగాణ వల్ల కాంగ్రెసు పార్టీయే లబ్ధి పొందుతుందని, టిడిపి, టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపిలు దెబ్బతింటాయని చెబుతున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన తమ పార్టీని దెబ్బతీసేందుకేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది.
రాయల తెలంగాణపై భగ్గుమంటున్న నేతలు
అధిష్టానం రాయల తెలంగాణ ఆలోచన చేస్తుందనే విషయం తెలియడంతో నేతలు అందరు ఒక్కటిగా భగ్గుమంటున్నారు. రాయల తెలంగాణ అంటే తాము నిరవధిక ఆందోళన చేస్తామని, తెలంగాణ ఇవ్వకుండే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
రాయల తెలంగాణ అంటే కాంగ్రెసు పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణపై సోనియా మభ్యపెడుతున్నారని, ప్యాకేజీలు, రాయల తెలంగాణతో మోసం చేయాలని చూస్తే తరిమి కొడతారన్నారు. పంచాయతీ ఎన్నికలలో లబ్ధి పొందేందుకే ఈ జిమ్మిక్కులు అన్నారు. తెలంగాణ వచ్చేదాకా కాంగ్రెసు నేతలపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు.
తాము రాయల తెలంగాణకు వ్యతిరేకమని, ఈ ప్రతిపాదన తమ పార్టీని దెబ్బతీసేందుకేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శోభా నాగి రెడ్డి అన్నారు.