కాంగ్రెసులో వేడి: ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర
తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు శుక్రవారం సమావేశం కానున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో అసెంబ్లీ సమావేశం హాల్లో గానీ, సిఎల్పీ కార్యాలయంలో గానీ సమావేశమై తెలంగాణపై చర్చించాలని నిర్ణయించామని, ఆ రోజు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లో అందుబాటులో ఉండాలని మంత్రులు గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.
28న సమావేశంలో ప్రత్యేక తెలంగాణ అంశంపై తీర్మానం చేసి, 29న రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్కు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక రాయల తెలంగాణపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, అవి మీడియా వార్తలకే పరిమితమని ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయానికి కాంగ్రెస్ సభ్యులుగా తాము కట్టుబడి ఉంటామని చెప్పారు.
కాగా, తెలంగాణ సారథ్య కమిటీ గురువారం సమావేశమై తాజా పరిణామాలను చర్చించింది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నామని తెలంగాణ పార్లమెంటు సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ సమావేశానంతరం చెప్పాుర. చారిత్రక నిర్ణయం తీసుకుని కాంగ్రెసు భవిష్యత్తును సంరక్షించాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు.
తెలంగాణకు ఎల్లలు ఏర్పడి ఉన్నాయని, అటువంటి స్థితిలో రాయల తెలంగాణ ప్రతిపాదన అవసరం లేదని ఆయన ఆన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తాము సోనియాను వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్ష తమ పార్టీ అధిష్టానానికి తెలుసునని ఆయన అన్నారు. సోనియా నిర్ణయం తెలంగాణ ప్రజలు మెచ్చేలా ఉంటుందని ఆశించారు.
తెలంగాణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కాంగ్రెసు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని, తెలంగాణ ఇస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆనంద భాస్కర్ అన్నారు. సోనియా గాంధీ చారిత్రక బాధ్యతను నిర్వహిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. ఈ నెల 30వ తేదీన తాము తలపెట్టిన బహిరంగ సభకు తరలిరావాలని ఆయన ప్రజలను కోరారు.