తెలంగాణ: విభజనకు సోనియా గాంధీ నిర్ణయం?
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు మాట్లాడుతున్న తీరు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. విభజన ఎలా చేయాలనే ఆలోచన మాత్రమే సాగుతోందని అంటున్నారు. రాయల తెలంగాణ అనే ప్రతిపాదన ఉన్నట్లు ఎక్కువగా ప్రచారం సాగుతోంది. ఆ దిశలో ఆలోచన సాగుతున్నట్లు కూడా తెలుస్తోంది. అది ఆలోచన మాత్రమేనని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అనడాన్ని బట్టి ఆ ఆలోచన సాగుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణకు ప్యాకేజీ ఇస్తారనే ప్రచారాన్ని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తోసిపుచ్చుతున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో పాటు మధుయాష్కీ వంటి నేతలు ఆ మాటను నిర్ద్వంద్వంగానే తోసిపుచ్చుతున్నారు. తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర సీనియర్ నేతలు చాలా మంది అందుకు సిద్ధపడినట్లు కూడా తెలుస్తోంది. రాయల తెలంగాణ ప్రతిపాదనకు తెలంగాణ నేతల నుంచే కాకుండా రాయలసీమ, ఆంధ్ర ప్రాంత నేతల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. రాయల తెలంగాణ ఏర్పాటు ఊహాజనితమేనని మంత్రి జానా రెడ్డి అన్నారు.

ఈ నెల 30వ తేదీన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభను తలపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి గతంలో దూరంగా ఉంటూ వచ్చిన తెలంగాణ నాయకులు కూడా బహిరంగ సభ ఏర్పాట్లకు కలిసి వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దాదాపుగా తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులంతా ఈ సభా నిర్వహణకు పనిచేస్తున్నారు. తెలంగాణ నేతలు సభ పెట్టుకోవడంలో తప్పు లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆ వ్యవహారమంతా చూస్తుంటే అధిష్టానం కనుసన్నల్లోనే ఆ బహిరంగ సభ జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. అయితే, జానా రెడ్డి ఆ ప్రచారాన్ని ఖండించారు. కాంగ్రెసు నేతలకు స్పష్టమైన సంకేతాలు అందడం వల్లనే ఈ వ్యవహారాలన్నీ నడుస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ సభలో తెలంగాణ కాంగ్రెసు నేతలు ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.
కాగా, పంచాయతీ ఎన్నికల కోసమే కాంగ్రెసు తెలంగాణ నాటకాన్ని తెర మీదికి తెచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం లేదని చెబుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం సమస్యను పరిష్కరించాలనే గట్టి పట్టుదలతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్ర విభజన కోసం ప్రస్తుతం సాగుతున్న ఆలోచనను కాంగ్రెసు అధిష్టానం మళ్లీ వెనక్కి తీసుకోదనే గ్యారంటీ ఏమీ లేదని అంటున్నారు.
ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదు తిరిగి వచ్చారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. మొత్తం మీద, తెలంగాణపై ఏదో ఒకటి జరుగుతుందని మాత్రం పరిణామాలను బట్టి అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications