తెలంగాణపై హడావిడి: స్థానిక ఎన్నికల కోసమేనా?
హైదరాబాద్: తెలంగాణపై వారం పది రోజుల్లో కసరత్తు పూర్తవుతుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెబుతున్నా పూర్తి నమ్మకం కుదరడం లేదు. తెలంగాణపై ఇది వరకు చాలా గడువులు పెట్టి పాటించలేదని, ఇప్పుడు నిర్ణయానికి గడువు పెట్టలేమని దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ అంకం తుది దశలో ఉందని, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. కానీ, ఈ మాటలపై ఎవరికీ విశ్వాసం కలగడం లేదు.
గతంలో కాంగ్రెసు అధిష్టానం పెద్దలు చేసిన ప్రకటనల కారణంగానే దిగ్విజయ్ సింగ్ మాటలపై కూడా నమ్మకం కుదరడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెసు తెలంగాణ నాయకుల బహిరంగ సభను డ్రామాగా అభివర్ణించింది. జూన్ 30వ తేదీన జరిగిన తెలంగాణ కాగ్రెసు బహిరంగ సభ కుట్రలో భాగమేనని తెరాస నాయకుడు కె. కేశవరావు సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వారంలోగా తెలంగాణ రాకుంటే కాంగ్రెసు నాయకులకు గ్రామాల్లోకి రానివ్వకూడదని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం ముందు పెడితే పరిశీలిస్తామని అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభను, తెలంగాణ కోసం పెద్ద యెత్తున కసరత్తు జరుగుతుందనే అభిప్రాయాన్ని కలిగించడం, దిగ్విజయ్ సింగ్ ప్రకటనలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికలతో ప్రారంభమై వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
అయితే, రాష్ట్ర విభజనకు కాంగ్రెసు అధిష్టానం గట్టి నిర్ణయం తీసుకుందని, సీమాంధ్ర నాయకులను ఒప్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. తెలంగాణపై ఇరు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలను తెలుసుకోవడానికే తన పర్యటనలో దిగ్విజయ్ సింగ్ ప్రాముఖ్యం ఇచ్చారు. అయితే, ఆయన మాటలు అటు తెలంగాణకు గానీ ఇటు సమైక్యాంధ్రకు గానీ మద్దతుగా లేవు. ఈ రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయని మాత్రం ఆయన చెప్పారు.
రిజర్వేషన్లకు సిఎం ఆమోదం
ఇదిలావుంటే, గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజేర్వేషన్ గెజిట్ను అధికారులు అందజేశారు. మొత్తం 21,590 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 10795 పంచాయతీలు మహిళలకు కేటాయించారు. బీసీలకు 6926, ఎస్సీలకు 3958, ఎస్టీలకు 1279 పంచాయతీలు రిజర్వ్ చేశారు.
రెండు, మూడు రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డి తెలిపారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ 29 రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. ఈ సారి 2.20 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుంచే కోడ్ అమల్లోకి వస్తుందని రమాకాంత్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications