కిరణ్, బొత్సలపై అపనమ్మకం: దామోదరకూ చాన్స్
తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు సోమవారం దిగ్విజయ్ సింగ్ను గాంధీభవన్లో కలిసి తమ వాదనలు వినిపించారు. బొత్స, కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రకు చెందినవారు కావడంతో వారిపై తెలంగాణ నాయకులు అప నమ్మకం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన దామోదర రాజనర్సింహను కోర్ కమిటీ సమావేశానికి ఆహ్వానించాలని కోరినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రాంత నాయకుల డిమాండ్ల గురించి తనకు తెలుసునని దిగ్విజయ్ సింగ్ అన్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై కాంగ్రెసుకు అవగాహన ఉందని దిగ్విజయ్ సింగ్తో భేటీ తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తాము దిగ్విజయ్ సింగ్కు తెలియజేశామని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన చెప్పారు. తమ ఆకాంక్ష త్వరలో నెరవేరుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.
తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వద్దని తాము దిగ్విజయ్ సింగ్కు చెప్పినట్లు మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. తెలంగాణపై పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరామని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రం ఇవ్వకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.
చంద్రబాబులోనూ కాంగ్రెసు డిఎన్ఎ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్లో కాంగ్రెసు డిఎన్ఎ ఉందని దిగ్విజయ్ సింగ్ అన్నట్లు వచ్చిన వార్తలపై తలెత్తిన వివాదాన్ని కాంగ్రెసు నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు. ఆ మాట దిగ్విజయ్ సింగ్ అన్నారో, లేదో నిర్ధారణ చేసుకోకుండా వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ను తాము ప్రత్యర్థిగా చూస్తున్నామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావులోనూ కాంగ్రెసు డిఎన్ఎ ఉందని ఆయన అన్నారు.
ఆదివారం తాము నిర్వహించిన తెలంగాణ సాధన సభను డ్రామాగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు అనడాన్ని ఆయన ఖండించారు. ఏది డ్రామానో, ఏది రియలో త్వరలోనే బయటపడుతుందని ఆయన అన్నారు. తమ దుకాణాలు మూతపడుతాయనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.