ఆ ముగ్గురిదే బాధ్యత: తెలంగాణపై దిగ్విజయ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమన్వయంతో పనిచేసి, తెలంగాణ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. సమైక్యాంధ్ర, తెలంగాణ అనే రెండు ప్రత్యామ్నాయాలపై వారు ముగ్గురు రోడ్ మ్యాప్లు తయారు చేస్తారని ఆయన చెప్పారు. సమన్వయ కమిటీ భేటీ అనంతరం ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తెలంగాణ అంశంపై చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి గడువులు లేవని ఆయన చెప్పారు. తెలంగాణపై వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్ ఇప్పటికే విస్తృతంగా సంప్రదింపులు జరిపారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని ఆయన అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజానాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణపై నిర్ణయం జరుగుతుందని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఆ ముగ్గురు ఇచ్చే రోడ్ మ్యాప్ ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో ఇది వరకు చాలా గడువులు పెట్టామని, వాటిని పాటించలేదని, మరోసారి గడువు పెట్టలేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని, చర్చల దశలో ఉందని ఆయన అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటనను ఓ మీడియా ప్రస్తావించినప్పుడు అన్నారు.

2014 ఎన్నికలు తమకు సవాల్ అని ఆయన అన్నారు. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నమూనాగా నిలుస్తుందని ఆయన చెప్పారు. తన పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన వచ్చిందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యత కల్పించామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయని ఆయన అన్నారు. వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు తమకు ప్రత్యర్థి పార్టీయేనని, ఆ పార్టీని తాము ఎదుర్కుంటామని ఆయన అన్నారు.
కావూరి గైర్హాజర్
కాగా, సమన్వయ కమిటీ సమావేశానికి కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు హాజరు కాలేదు. సమన్వయ కమిటీ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రి చిరంజీవి, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమావేశానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications