హైదరాబాద్, నీరు: డిగ్గీకి 'సీమాంధ్ర' 5 పేజీల నివేదిక
12 మంది మంత్రులు, 5గురు పార్లమెంటు సభ్యులు, 42 మంది ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు 5 పేజీల నివేదికను ఆయనకు ఇచ్చారు. అందులో హైదరాబాదు, నీటి విషయంలో సమస్యలు తలెత్తుతాయని వారు ఆ నివేదికలో ప్రధానంగా పేర్కొన్నారు. రాజోలిబండ, సుంకేశుల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల విషయంలో సమస్యలు తలెత్తుతాయని నివేదికలో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రకే తొలి ప్రాధాన్యత ఇచ్చిందని, తెలంగాణలో అభివృద్ధి చెందిందని, తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నట్లుగానే, సీమాంధ్రలోను ఉన్నాయని తేల్చిందని వారు అందులో పేర్కొన్నారు. కాగా ఈ దిగ్విజయ్తో జరిగిన సీమాంధ్ర నేతల భేటీల్లో మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, సి.రామచంద్రయ్య, తోట నరసింహం గైర్హాజరయ్యారు.
దిగ్విదయ్ నివేదిక తర్వాతే: గవర్నర్
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉందని గవర్నర్ నరసింహన్ సోమవారం అన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తన నివేదికను అధిష్టానానికి ఇచ్చిన తర్వాతనే విభజనపై నిర్ణయం వెలువడుతుందని ఆయన అన్నారు.
అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణపై కేంద్రం త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వెలువరుస్తుందని చెప్పారు. కేంద్రం ఈ విషయమై స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని గవర్నర్ చెప్పారు.