50 సీట్లే: తెలంగాణపై అధిష్టానానికి సీమాంధ్ర 'లెక్కలు'!
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు నేతలు దానిని అడ్డుకునేందుకు కొత్త వాదనను ఢిల్లీ పెద్దలకు వినిపించేందుకు సిద్ధమవుతున్నారట. ఇందుకు సంబంధించి వారు లెక్కలు వేసి మరీ అధిష్టానానికి విన్నవించే ప్రయత్నాలు చేస్తున్నారట. 2014 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అధిష్టానం విభజనకు సానుకూలంగా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఏ క్షణంలోనైనా విభజనపై ప్రకటన రావొచ్చునని అభిప్రాయపడుతున్నారు. అయితే తెలంగాణా? లేక రాయల తెలంగాణా? అన్న అంశం పైనే తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు. విభజనపై ప్రచారం సాగుతుండటంతో సీమాంధ్ర నేతలు సైతం అప్రమత్తమయ్యారు. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తాము నచ్చజెపుతామని ఇప్పటికే వారు ప్రకటించారు. విభజనకు సిద్ధమైతే విభజన జరగకుండా ఉంటే కాంగ్రెసుకు ఎలా లాభం చేకూరుతుందో లెక్కలు వేసి పెద్దలకు వివరించేందుకు సన్నద్ధమవుతున్నారట.

అధిష్టానం 2014 ఎన్నికలలో ఎక్కువ సీట్లను గెలుచుకునే వ్యూహంలో భాగంగానే విభజనకు అనుకూలంగా ఉందని అంటున్నారు. రాయల తెలంగాణ, రాయల ఆంధ్రా ద్వారా కాంగ్రెసు పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఇప్పటికే అధిష్టానం ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే విభజన జరగకుంటేనే కాంగ్రెసుకు లాభం జరిగే అవకాశాలున్నాయని సీమాంధ్ర నేతలు మొదట రాష్ట్రానికి వచ్చిన పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్కు, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి చెప్పనున్నారట.
రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలు ఉండగా ఎంత సెంటిమెంట్ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం 50 నుండి 60స్థానాలలో మాత్రమే ప్రభావితం చేయగల్గుతుందని సీమాంధ్ర నేతలు పలువురు భావిస్తున్నారట. ఇదే విషయాన్ని వారు ఢిల్లీ పెద్దలకు చెప్పనున్నారట. సెంటిమెంట్ను క్యాష్ చేసుకునేందుకు ఇటు తెరాస, అటు భాజపాలు పోటీ పడుతున్నాయని, ఈ నేపథ్యంలో తెరాస తెలంగాణ ప్రాంతంలోని సగం స్థానాలలో కూడా ప్రభావితం చేయలేదని, ఇక బిజెపి ఓట్లను చీల్చుతుందే తప్ప గెలిచే పరిస్థితి లేదని చెప్పేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
అదే రాష్ట్రాన్ని విడదీస్తే ఆ క్రెడిట్ కాంగ్రెసుకు దక్కకుండా మొదట తెరాస, ఆ తర్వాత బిజెపిలకు దక్కుతుందని, అప్పుడు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసుకు నష్టమని, అదే సమయంలో విభజన ద్వారా సీమాంధ్రలో నష్టపోతుందని చెప్పనున్నారని అంటున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే కాంగ్రెసు పార్టీకి లాభమని చెప్పాలని భావిస్తున్నారని అంటున్నారు.
అయితే అధిష్టానం ఇప్పటికే అన్ని విధాలుగా ఆలోచించి, తమకు అనుకూలంగా లెక్కలు వేసుకున్నాకే ఓ నిర్ణయానికి వచ్చిందని, సీమాంధ్ర నేతల మాటలు వినిపించుకునే అవకాశాలు ఉండవని మరికొందరు చెబుతున్నారు. అయితే తెలంగాణలో పార్టీకి మరింత సానుకూలంగా ఉండి, ఇతర పార్టీలను దెబ్బతీసేందుకు తీర్మానం అంశాన్ని తెర పైకి తీసుకు రావాలని సూచించే యోచనలో ఉన్నారట.












Click it and Unblock the Notifications