నేను బాధపడ్డా: తెలంగాణపై దిగ్విజయ్ గుట్టు విప్పారా?
ఇదే సమయంలో ఆయన మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సమావేశంలో ఇరు ప్రాంత నేతలు పాల్గొన్నారు. ఇరు ప్రాంత నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో దిగ్విజయ్ విభజన జరుగుతుందనే సంకేతాలు ఇచ్చే కోణంలో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారట.
రాష్ట్రంలోని సాగు నీటి వాటాలు, రాష్ట్ర విభజన జరిగితే వాటి భౌగోళిక స్వరూపం, సచివాలయంలో ఉద్యోగులు విడిపోతారు, విడిపోతే ఇద్దరు సిఎంలు వస్తారు... ఇలా కొన్ని అంశాలపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి అంశాలపై చర్చించడం ద్వారా అధిష్టానం మదిలో ఏముందో దిగ్విజయ్ పరోక్షంగా చెప్పినట్లుగా భావిస్తున్నారు. అధిష్టానం విభజనకే మొగ్గుచూపుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యల్లో అర్థమవుతోందని అంటున్నారు.
అదే సమయంలో మరో కీలక వ్యాఖ్య కూడా చేసినట్లుగా తెలుస్తోంది. తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిందని, అప్పుడు తాను బాధపడ్డానని, ఇదే సహజమేనని అభిప్రాయపడ్డారట. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కోర్ కమిటీ సభ్యుడే. అయితే కోర్ కమిటీ భేటీలో రాహుల్ పాల్గొంటారని ప్రత్యేకంగా చెప్పడం ద్వారా ఆయన నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలని దిగ్విజయ్ సూచించినట్లుగా భావిస్తున్నారు.
తాను ఢిల్లీ వెళ్లాక ఇరు ప్రాంతాల నేతలను పిలుస్తానని, అందరి అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా దిగ్విజయ్ వ్యాఖ్యలపై నాయకులలో జోరుగా చర్చ సాగుతోంది. అధిష్టానం సూచనల మేరకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని చర్చించుకుంటున్నారు. దిగ్విజయ్ విభజనకు సంకేతాలు ఇస్తూనే రాష్ట్రం సమైక్యంగా ఉంటే ఎలా ఉంటుందని కూడా నేతలను ప్రశ్నించారు.