ఆశీస్సులు ఇప్పించి డుమ్మా: జైపాల్ గైర్హాజరీ వెనుక..!?
తెలంగాణపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర మంత్రి వర్గమే కాబట్టి ఆ మంత్రివర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జైపాల్ ఈ సభకు హాజరు కావడం అంత సరైంది కాదని అధిష్ఠానం పెద్దలు సూచించడం వల్లే ఆయన రాలేదని అంటున్నారు. నిజానికి ఈ సభ ఏర్పాటుకు తెర వెనుక పాత్ర పోషించింది జైపాల్ రెడ్డేనని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, రాష్ట్రమంత్రులు జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ తదితరులు వరుసగా ఢిల్లీ వచ్చినప్పుడు ఈ సభ గురించి చర్చలు జరిగాయి. అప్పట్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న గులాంనబీ ఆజాద్ నుంచి సభకు గ్రీన్ సిగ్నల్ లభించేందుకు జైపాల్ గట్టిగా కృషి చేశారట.
దామోదర్, ఉత్తమ్, డిఎస్ తదితరులు సోనియా గాంధీని కలిసినప్పుడు కూడా సభ గురించి ప్రస్తావన వచ్చిందంటున్నారు. తెలంగాణ నేతలు, మంత్రులందరికీ ఈ సభకు అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నాయన్న విషయం తెలుసునని, అందుకే కలిసికట్టుగా వ్యవహరించారని అంటున్నారు.
రాయల తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: మజ్లిస్
తాము రాయల తెలంగాణకు కట్టుబడి ఉన్నామని మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కాలయాపన చేయకుండా త్వరగా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా ఎంఐఎం అభిప్రాయం చెప్పాలనడం అర్థరహితమని ఆదివారం సంగారెడ్డిలో అన్నారు. రాయల తెలంగాణనిస్తారో లేక పది జిల్లాల తెలంగాణ ఇస్తారో లేక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో.. ఏ విషయాన్నీ తేల్చిచెప్పాలన్నారు.