గెలుపే జగన్కి బహుమతి: విజయమ్మ, వస్తాడని షర్మిల
జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ఎప్పుడైనా మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని విజయమ్మ గుర్తు చేశారు. కానీ అలాచేస్తే ఓడిపోతామనే భయంతో ముందుగా పార్టీ ప్రమేయంలేని గ్రామ పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు.
ప్రజల ఆశీస్సులతో మన పార్టీయే గెలుస్తుందన్నారు. గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు కూడా నవంబర్, డిసెంబర్లలో వచ్చే అవకాశముందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు చేతులు కలిపిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. బాబుకు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదన్నారు. అధికారంలో ఉండీ ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు అన్నీ చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కొందరు మంత్రులు, అధికార పార్టీ నేతలు జగన్ పై, తమ కుటుంబంపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని సదస్సులో విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు వెన్నుపోటుదారులో ప్రజలకు తెలుసని మంత్రి రఘువీరా రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేతలు జగన్, భారతి, షర్మిల, తనపై, చివరకు తన మతం పైనా మాట్లాడారని, ఇక వారి మాట్లాడేందుకు మిగిలింది ఇంట్లోని చిన్నపిల్లలు మాత్రమే అన్నారు.
తెలంగాణపై..
వైయస్ ఎప్పుడూ పేదలకోసం ఆలోచించేవారని, తెలంగాణవాదాన్ని గౌరవిస్తూనే, అభివృద్ధి లక్ష్యంతో ముందుకు వెళ్ళేవారన్నారు. తెలంగాణపై నిర్ణయం మనచేతుల్లో లేదు. ప్లీనరీలోనూ జగన్ ఇదే చెప్పారు. వైయస్ ఉంటే ఇప్పటికే జలయజ్ఞం పూర్తయ్యేది. తెలంగాణ రైతులకు భరోసా కల్పించే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసేవారన్నారు. తెలంగాణ తమ చేతిలో లేదన్నారు. దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని చెప్పారు.
జగన్ వస్తాడు: షర్మిల
జగన్ జైలు నుంచి వస్తాడని, ముఖ్యమంత్రి అవుతాడని, ప్రజల కష్టాలు తీరుస్తాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. ఆమె పాదయాత్ర విశాఖలో కొనసాగుతోంది. జగన్ సీఎం అయ్యాక అందరి కష్టాలు తీరుతాయని గజపతినగరంలో మహిళలకు భరోసా ఇచ్చారు.