వరదలు: మృతుల సంఖ్య ఎప్పటికీ తెలియదు, నిందలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో మృతి చెందిన వారి సంఖ్య కచ్చితంగా ఎప్పటికీ తెలియకపోవచ్చునని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ఆదివారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, స్పీకర్ గోవింద్ సింగ్లు స్పందిస్తూ.. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్యను వేర్వేరుగా చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై బహుగుణ స్పందించారు.
ఉత్తరాఖండ్ వరదల్లో మృతుల సంఖ్య ఎప్పటికీ కచ్చితంగా తెలిసే అవకాశం లేదన్నారు. కేదార్నాథ్లోనే కాదు.. రాష్ట్రంలో ఎటుచూసినా ఐదారు వందల మృతదేహాలు కనిపిస్తున్నాయన్నారు. ఉత్తరాఖండ్ యాత్రకు వచ్చిన వారు తిరిగిరాలేదని, మరణించినట్లే భావించాలని ఆయా రాష్ట్రాల అధికారులు ధ్రువీకరిస్తే, అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల పేరిట పరిహారం సొమ్ము పంపుతామన్నారు.

మరోవైపు బద్రీనాథ్లో 900మంది మాత్రమే అక్కడున్నట్లు తెలుస్తోంది. వారికి అవసరమైన ఆహార, వైద్యసాయం అందిస్తున్నారు. కాగా, మృతుల సంఖ్య పదివేలకు పైనే ఉండవచ్చని జాతీయ విపత్తు నివారణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఇంకా 1500 మంది చిక్కుకొని ఉన్నారని తెలిపారు. దాదాపు 1.07లక్షలమంది బాధితులను రక్షించామని చెప్పారు. బదరీనాథ్-రామ్బాడా మధ్య రహదారిని పునరుద్ధరించారని వివరించారు.
ఆలయాన్ని నిర్మించుకుంటాం
వరద దెబ్బకు ధ్వంసమైన కేదార్నాథ్ ఆలయాన్ని తామే పునర్నిర్మించుకుంటామని బహుగుణ స్పష్టం చేశారు. ఆలయాన్ని మళ్లీ నిర్మించేందుకు సాయపడతామని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతోపాటు మరికొందరు సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వంతో కలసి ఆలయ కమిటీ ఈ బాధ్యతను నిర్వర్తించగలదని చెప్పారు.
వరదలపై ఒకరిపై మరొకరు నిందలు
వరదల్లో వేలాది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వరదల తప్పు తమది కాదంటే తమది కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం, వాతావరణ శాఖ చెబుతున్నాయి. తాము వర్షాలు వస్తాయనే సమాచారాన్ని అందించామని వాతారవణ శాఖ చెబుతుండగా, ప్రతి యేటాలాగే ఇప్పుడు అనుకున్నామని, అందులో తీవ్రత కనిపించలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications