డిగ్గీ ఓపెన్గా చెప్పారు, పార్టీ చింతిస్తోంది: టిపై డిఎస్
ప్రాణత్యాగాలు దురదృష్టకరం
తెలంగాణ కోసం వెయ్యి మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేయడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు నాలుగేళ్ల క్రితం కేంద్రం ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వెనక్కి పోయిందన్నారు. నాడు వెనక్కి పోయినందుకు తమ పార్టీ చింతిస్తుందన్నారు. నాడు ప్రకటన వచ్చి వెనక్కి పోవడంతో నోటి వద్దకు వచ్చిన బుక్క వెనక్కి పోయిందనే భావన తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు వద్దని, రాష్ట్రం వస్తుందన్నారు.
తీర్మానం అభిప్రాయ సేకరణకే
కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా తెలుగు ప్రజల మధ్య రాగద్వేషాలు పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అవి సరికాదన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా అందరం కలిసే ఉంటామన్నారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం జరిగినా ఏమీ కాదని, తీర్మానం తెలంగాణకే అనుకూలంగా ఉంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. 125 ఏళ్ల గల కాంగ్రెసు పార్టీకి పంచాయతీ ఎన్నికల ఓట్ల కోసం అబద్దాలు చెప్పే అవసరం లేదన్నారు. అసెంబ్లీలో తీర్మానం జరిగినా అది అభిప్రాయ సేకరణేనని, నిర్ణయం మాత్రం అధిష్టానానిదే అన్నారు. తీర్మానం రాజ్యాంగ ప్రక్రియలో ఓ భాగమన్నారు.
కాంగ్రెస్ మోసం చేయదు.. చింతిస్తోంది
కాంగ్రెసు పార్టీ ఎప్పుడు ఎవరినీ మోసం చేయలేదన్నారు. సున్నితమైన ఈ అంశంపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందన్నారు. విభజన జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నందుకే చింతిస్తోందన్నారు. తెలంగాణపై తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్తో చర్చించానని, తమ పార్టీ అధినేత్రి అపాయింటుమెంట్ తాను ఇప్పించలేదన్నారు.
తెలంగాణపై ఏది ఏమైనా రాజ్యాంగం ప్రకారమే జరుగుతుందన్నారు. ఎక్కడ నివసిస్తున్న వారికైనా రాజ్యాంగపరమైన హక్కులుంటాయన్నారు. విభజన పైన ఇరు ప్రాంతాల మధ్య సమన్వయం అవసరమని, విభేదాలకు తావులేకుండా సమస్యను పరిష్కరించుకుందామన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తనకు స్నేహితుడేనని, ఆయన వ్యాఖ్యలు సరికావన్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలనే దానిపై పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిల అభిప్రాయాలను అడిగారన్నారు.