ఈజిప్టులో మోర్సీని పదవీచ్యుతుడిని చేసిన సైన్యం
కైరో: ఈజిప్టు అధ్యక్షుడు మొహమద్ మోర్సీని సైన్యం బుధవారం పదవీచ్యుతుడిని చేసింది. రాజకీయ, మత, యువ నాయకులు ద్వారా రాజకీయ మార్పునకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు మోర్సీ అధ్యక్ష భవనం వద్దకు ట్యాంకులు, ట్రూప్స్ పెద్దయెత్తున చేరుకున్నాయి. సామాన్యుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోర్సీ విఫలమయ్యారని టెలివిజన్ ద్వారా సైన్యం ప్రకటించింది.
రాజ్యాంగబద్దమైన కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ తాత్కాలిక అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. మోర్సీ ప్రత్యర్థులు, మద్దతుదారులు అలెగ్జెండ్రియా వద్ద ఘర్షణకు దిగారు. ఆ ఘర్షణ అనంతరం మోర్సీని గద్దె దించారు. తనపై పెరుగుతున్న ఒత్తిడిని లెక్క చేయకుండా మోర్సీ అధికారంలో కొనసాగుతూ వచ్చారు.
తిరుగుబాటు నేపథ్యంలో మోర్సీ బుధవారం రాత్రి తన అనుచరులతో రహస్య ప్రదేశానికి తరలి వెళ్లినట్లు సమాచారం. వారు ఎక్కుడున్నారనే విషయం తమకు తెలియదని, మిలిటరీ ఇంటలిజెన్స్ ఫెసిలిటీలో వారిని పెట్టి ఉంటారని ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ అంటోంది.
మోర్సీ ఉద్వాసనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. గత రెండేళ్లలో ఈజిప్టులో ఇది రెండో తిరుగుబాటు. 2011లో హోస్నీ ముబారక్ను గద్దె దించారు. నియంత హోస్నీ ముబారక్ మూడు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించారు.