అగ్రవర్ణ యువతితో పెళ్లి వివాదం: యువకుడు మృతి
చెన్నై: తమిళనాడు ఉత్తర జిల్లాలను ఆరు నెలలుగా అట్టుడికించిన ఓ కులాంతర వివాహ బంధం శాశ్వతంగా విడిపోయింది. భర్త ఇళవరసన్ గురువారం ధర్మపురిలో రైల్వే పట్టాల పక్కన శవమై తేలాడు. ఈ మృతి ధర్మపురి జిల్లాలోని నాయకన్ కొట్టై ప్రాంతాన్ని మరోసారి ఉద్రిక్తతలోకి నెట్టింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వెనుక కనుగొన్నట్లు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
అగ్రవర్ణ యువతితో పెళ్లి.. ఆరు నెలలుగా ఉద్రిక్తం
గతేడాది నవంబరు నెలలో అట్టడుగు వర్గానికి చెందిన ఇళవరసన్ అనే యువకుడు అగ్రవర్ణ కులానికి చెందిన దివ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత అట్టడుగు వర్గాలకు చెందిన దాదాపు మూడు వందల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు వందలాది మందిని అరెస్టు చేశారు. కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై కోర్టు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం దివ్య తల్లి తన కూతురు కనిపించడం లేదంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కోర్టుకు హాజరైన దివ్య తాను తన తండ్రి మరణం తట్టుకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నానని చెప్పారు. హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ఆ తర్వాత దివ్య తల్లితోనే ఉండిపోయింది.
బుధవారం ఇళవరసన్ వెళ్లి పిలిస్తే తాను రానని, తల్లితోనే ఉంటానని దివ్య చెప్పింది. ఆ తర్వాత యువకుడు శవమై కనిపించాడు. పోస్టుమార్టం జరుగుతున్న ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువులు ధర్నాకు దిగారు. ఆత్మహత్య కాదని, హత్యేనని ఆరోపించారు. ఈ ఘటన ఆరు నెలలుగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతను రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు 144వ సెక్షన్ విధించారు.