రోడ్మ్యాప్ కసరత్తు: కావూరి, మంత్రులతో బొత్స భేటీ
కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావుతో బొత్స సత్యనారాయణ దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కావూరి సాంబశివరావు గతంలో సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సమస్యపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కావూరి సాంబశివరావు చెప్పారు. ఈ స్థితిలో బొత్సకు, కావూరికి మధ్య జరిగిన చర్చల వివరాలు తెలియడం లేదు.
కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పల్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జెడి శీలంలతో బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో అరగంట పాటు మాట్లాడారు. కొంత మంది సీనియర్ పార్లమెంటు సభ్యులతో కూడా ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విభజన అనివార్యమైతే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
బొత్స సత్యనారాయణ దిగ్విజయ్ సింగ్ను కలిశారు. తెలంగాణపై ఆయన ఓ నివేదికను ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, తాను ఏ విధమైన నివేదిక ఇవ్వలేదని బొత్స మీడియా ప్రతినిధులతో చెప్పారు. అధిష్టానం అడిగినప్పుడు నివేదిక సమర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై నాయకులతో సంప్రదింపులు జరిగాయని, మరి కొంత మంది నాయకులతో కూడా మాట్లాడుతానని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో కూడా మాట్లాడుతానని అన్నారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా దిగ్విజయ్ సింగ్తో సమావేశమయ్యారు.
ఇదిలావుంటే, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రోడ్ మ్యాప్ తయారీ కోసం హైదరాబాదులో తెలంగాణ ప్రాంత నాయకులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో రాయలసీమకు చెందిన సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటించిన తర్వాత సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాకు జెసి దివాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు.