వర్కింగ్ కమిటీలో నిర్ణయం: తెలంగాణపై దిగ్విజయ్

తెలంగాణపై కోర్ కమిటీ సమావేశంలో చర్చించామని, ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కోర్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు చెప్పిన విషయాలు విన్నారని ఆయన చెప్పారు.
రెండు గంటలపాటు జరిగిన కోర్ కమిటీ సమావేశానంతరం దిగ్విజయ్ సింగ్ మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. పార్టీలోని అత్యున్నత నిర్ణాయక విభాగం వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే, వర్కింగ్ కమిటీ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని ఆయన చెప్పలేదు. కోర్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ అంశాన్ని నాన్చడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా లేదు. దీంతో వర్కింగ్ కమిటీ సమావేశం సాధ్యమైనంత త్వరలోనే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకుంటూ, దేశంలోని ఇతర రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లపై ఓ కమిటీ వేయడానికి వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు.
దేశంలో 20 నుంచి 25 వరకు కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు ఉన్నాయి. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయంలో ఆ డిమాండ్లపై ఆందోళనలు చెలరేగకుండా వాటిపై పరిశీలనకు లేదా అధ్యయానికి కమిటీ వేస్తూ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications