ఉప్పొంగుతున్న గోదారి: సిఎం సమీక్ష, అప్రమత్తం
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో వివిధ చోట్ల గోదావరి నది ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. రాజమండ్రి వద్ద, ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి అధికంగా ఉంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 11 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 9 లక్షల క్యూసెక్కుల నీటిని శుక్రవారం విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, సహాయకార్యక్రమాలు చేపట్టారు. ధవళేశ్వరం వద్ద అధికారులు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. రహదారులు నీట మునిగిపోయాయి.పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరదల కారణంగా భద్రాచలం డివిజన్లో తొలి దశ పంచాయితీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారీ వర్షాలపై ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. విజయవాడ నుంచి భద్రాచలానికి మూడు ప్రత్యేక బృందాలను అధికారులు తరలించారు. భద్రాచలంలో రెండు పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో 8 మంది మృతి
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో 8 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లాలో నలుగురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం, హైదరాబాద్ జిల్లాల్లో ఒక్కరేసి మరణించారని ఆయన చెప్పారు.
భారీ వరదలపై ముఖ్యమంత్రి కిరణ్ సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి శుక్రవారం ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. భారీగా వర్షాలు కురుస్తున్న ఖమ్మం జిల్లాకు రెండు ఎన్టీఆర్ఎఫ్ బృందాలను తరలించాలని, అవసరమైతే వైమానిక దళం సహాయం తీసుకోవాలన్నారు. ఆహార ధాన్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.
వరద నీటిలో పశువుల కాపర్లు
వరంగల్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు ములుగు మండలం సర్వారావు శివారులో బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దాటుతుండగా ముగ్గురు పశువుల కాపర్లు అందులో చిక్కుకున్నారు. వారిని రక్షిండానికి స్థానికులు తీవ్రంగా యత్నిస్తున్నారు.
నీటిలో మోడల్ స్కూల్
కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సైదాపురం మండలం సోమారంలో నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ నీటమునిగింది. సుమారు 10 అడుగుల మేర వరద నీరు వచ్చిచేరింది. కాగా నిర్మాణ భవనంలో ఉన్న దాదాపు 40 మంది కార్మికులు వరద నీటిలో చిక్కుకున్నారు.
పాత ఇళ్లు కూలి ఒకరు మృతి
మెదక్ జిల్లాలోని కల్హేర్ మండలం రామిరెడ్డిపాడులో ఓ పాత ఇళ్లు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్లు కూలినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా బెజ్జూరు మండలం తీగలపల్లివాగులో శుక్రవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications