సంతకాలు: బొత్సపై కొండా సురేఖ ఫైర్, కిరణ్పై రోజా
వైయస్ రాజశేఖర రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బొత్స వెంటనే క్షమాపణ చెప్పాలని ఆ పార్టీకి చెందిన నేతలు సామినేని ఉదయభాను, జలీల్ ఖాన్లు విజయవాడలో డిమాండ్ చేశారు. మద్యం, పేకాట లేకుండా బొత్సకు రోజు గడవదన్నారు. ఎంపిగా ఉండే పేకాట ఆడిన చరిత్ర ఆయనదన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మనిషి బొత్స అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ చలువ లేకుంటే బొత్స సాధారణ కార్యకర్తగా మిగిలే వారన్నారు.
కన్నీరు కత్తి కంటే పదును: రోజా
ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా శుక్రవారం మండిపడ్డారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. విజయమ్మ చేపట్టిన ఫీజు పోరు దీక్షా ప్రాంగణంలో రోజా మాట్లాడారు.
విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపిన ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పేదవాడి కన్నీరు కత్తికంటే పదునైందన్నారు. అది ప్రభుత్వానికి శాపంగా మారుతుందని మండిపడ్డారు. అవసరం అయిన వాటికి నిధులు కేటాయించని సర్కారు అడ్డగోలుగా ప్రజలపై పన్నుల భారం మోపుతోందన్నారు.