పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ: డబ్బులివ్వలేదని...

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చిరువూరు గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు పోలింగును అడ్డుకున్నారు.స్థానిక నాయకులు వచ్చి ఓటర్లతో మాట్లాడటంతో గొడవ సద్దుమణిగింది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రచారం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమిల్లి పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. గత పదేళ్లుగా తమ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదంటూ లక్ష్మీపురం కాలనీ వాసులు పోలింగును బహిష్కరించారు.
కడప జిల్లాలో పలుచోట్ల కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. చిత్తూరు జిల్లాలోని కంచనపుత్తూరులో ఓ వ్యక్తి బ్యాలెట్ పత్రాలను బయటకు తెచ్చాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఎన్.కొత్తపల్లిలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు నేతల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పోలింగ్ ప్రక్రియ వేగవంతం: మిట్టల్
రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైందని ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాదులో వెల్లడించారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ జోరుగా సాగుతోంది.
కాగా, అనంతపురం 50, మెదక్ 54, కృష్ణా 63, గుంటూరు 70, కడప 45, చిత్తూరు 66, కర్నూలు 70, కడప 45, విజయనగరం 61, నల్గొండ 50, రంగారెడ్డి 50, ఎస్పీఎస్ నెల్లూరు 54, రంగారెడ్డి 50, పశ్చిమ గోదావరి 57, తూర్పు గోదావరి 50, వరంగల్ 57, కరీంనగర్ 51, ప్రకాశం 67, మహబూబ్ నగర్ 47, అదిలాబాద్ 35, నిజామాబాద్ 48, శ్రీకాకుళం 62, విశాఖ జిల్లాల్లో 46 శాతంగా ఓటింగ్ నమోదయింది.












Click it and Unblock the Notifications