తెలంగాణ: జగన్పార్టీ బాలినేని రాజీనామా, జిట్టా కౌంటర్
సమైక్యాంధ్ర కోసం వరుసగా సీమాంధ్ర నేతలు రాజీనామా చేస్తున్నారు. పదిహేను రోజుల క్రితం కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసులు, ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రోజు కడప జిల్లా కమలాపురం కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు జగన్ పార్టీ నేత బాలినేని రాజీనామా చేశారు. రాష్ట్రాన్ని విభజించవద్దని డిమాండ్ చేస్తూ ఆయన రాజీనామా చేశారు. వీరశివా రెడ్డి రాజీనామాతో సీమాంధ్ర నేతలపై ఒత్తిడి పెరిగినట్లుగా కనిపిస్తోంది.
జిట్టా కౌంటర్
సీమాంధ్రకు చెందిన తమ పార్టీ నేతల రాజీనామాలపై తెలంగాణ ప్రాంత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి స్పందించారు. తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, దానికి కట్టుబడి ఉంటామని అధిష్టానం చెప్పిందని, ఇప్పుడు నిర్ణయం వెలువడే సమయంలో వారు రాజీనామాలు చేయడం సరికాదన్నారు. కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని తమ పార్టీ నిర్ణయించిందని, ఇప్పుడు నిర్ణయానికి ముందు తమకు చెప్పాలనడం ఎంత వరకు సబబు అన్నారు. రాజీనామాలు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, తమ ప్రాంత ప్రజల మనోభావాలను కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు.
రాజీనామాలపై సీమాంధ్ర మంత్రులు
ఓ వైపు సమైక్యాంధ్ర కోసం పలువురు నేతలు రాజీనామా చేస్తుంటే సీమాంధ్ర మంత్రులు మాత్రం రాజీనామా చేస్తామన్న వార్తలను కొట్టి పారేశారు. ఈ రోజు వేర్వేరుగా మంత్రులు టిజి వెంకటేష్, శైలజానాథ్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ.. తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పామే తప్ప రాజీనామాలు చేస్తామని చెప్పలేదన్నారు.