సోనియాకు సిఎం రాజీనామా: ఆంధ్ర సిఎంగా బొత్స?
శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు కిరణ్ కుమార్ రెడ్డి టెన్ జనపథ్లో సోనియాను కలిసి రాజీనామా లేఖను ఇచ్చినట్లు చెబుతున్నారు. దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్లతో జరిగిన భేటీలో రాష్ట్ర విభజనను ముఖ్యమంత్రి వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. విభజన అనేది కాంగ్రెసు అధ్యక్షురాలి నిర్ణయమని, ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షురాలి నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుందని వారు ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం.
తాము ఎంత చెప్పినా వినకపోవడంతో అదే విషయాన్ని సోనియాకు చెప్పాలని వారు కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి సోనియాను కలవడానికి ప్రయత్నించారు. అయితే, సోనియా అపాయింట్మెంట్ ఆయనకు లభించలేదు. ఆజాద్ జోక్యం చేసుకోవడంతో సోనియా కిరణ్ కుమార్ రెడ్డికి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. తన వైఖరిని కిరణ్ కుమార్ రెడ్డి వివరించి సోనియాకు రాజీనామా లేఖ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
ఆ తర్వాత ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా లేఖ ప్రస్తుతం సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి శనివారంనాడు సచివాలయానికి రాలేదు, అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. హెలికాప్టర్లో నల్సార్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.
కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించకపోయినప్పటికీ రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రణాళికను కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. శానససభను సస్పెండ్ యానిమేషన్లో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించి, విభజనను పూర్తి చేస్తారని అంటున్నారు. కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి నిజానికి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉండాల్సింది. కిరణ్ కుమార్ రెడ్డి అందుకు కూడా అంగీకరించకపోతే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.