తిరుమల కిటకిట, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన..!!
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అలిపిరి టోల్ గేట్ నుంచే రద్దీ కనిపిస్తుంది. నిన్న అలిపిరి టోల్ గేట్ వద్దనే భక్తులను నిలిపి టోకెన్లు మంజూరు చేశారు. వారికి ఇచ్చిన సమయం తర్వాత మాత్రమే అనుమతించారు. ప్రతీ రోజు 80 వేల మందికి దర్శనం అందుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేస్తోంది.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ గోగర్భం డ్యామ్ వరకూ విస్తరించింది. అంటే కిలోమీటర్ల మేర క్యూ లైన్ కొనసాగుతుంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల నుంచి ముప్ఫయి గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. శీఘ్రదర్శనం టోకెన్లున్న భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయంపడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 86,315 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 44,107 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

భక్తులకు కీలక సూచన
గత రెండు రోజుల నుంచి దాదాపు డెబ్భయి వేల మంది భక్తులు కాలినడకన తిరుమలకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా క్యూ లైన్లను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు పూర్తిగా సిబ్బందికి సహకరించాలని.. సంయమనంతో దర్శనం చేసుకోవాలని సూచన చేస్తోంది. క్యూ లైన్ లలో ఉన్న వారికి శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, మజ్జిగ, మంచినీరు, పాలను పంపిణీ చేస్తున్నారు. ఉన్నతాధికారులు దర్శనం క్యూ లైన్ల నిర్వహణ పర్యవేక్షిస్తున్నారు.













Click it and Unblock the Notifications